అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లే లేరా..? టీమిండియా పై ఫైర్ అయిన గవాస్కర్
IND vs SA T20I: స్వదేశంలో వరుసగా రెండు మ్యాచులు ఓడటంతో తాత్కాలిక సారథి రిషభ్ పంత్ తో పాటు టీమిండియా మేనేజ్మెంట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండియా-దక్షిణాఫ్రికా నడుమ జరిగిన రెండు టీ20 లలో బౌలర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. తొలి మ్యాచ్ లో బ్యాటర్లు భారీ స్కోరు చేసినా బౌలర్లు దానిని కాపాడలేకపోయారు. ఇక కటక్ లో ముగిసిన రెండో టీ20 లో కూడా భువనేశ్వర్ మినహా మిగిలిన బౌలర్లు విఫలమయ్యారు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియాపై ఫ్యాన్స్ తో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయమై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియా పై తనదైన శైలిలో విమర్శలు సంధించాడు.
కటక్ మ్యాచ్ అనంతరం గవాస్కర్ మాట్లాడుతూ.. ‘అసలు సమస్య ఏంటంటే జట్టులో భువనేశ్వర్ కుమార్ తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు. వికెట్లు తీస్తేనే కదా ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెరిగేది..
గత రెండు మ్యాచులలో చూస్తే భువీ తప్ప వికెట్లు తీయగలరనే బౌలర్ ఎవరైనా కనిపించారా..? ఢిల్లీ మ్యాచ్ లో భారత్ భారీస్కోరు చేసినా ఓడటానికి కారణం కూడా ఇదే..’ అని వ్యాఖ్యానించాడు.
రెండో టీ20 లో భువనేశ్వర్.. 4 ఓవర్లు వేసి 13 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చేసింది స్వల్ప స్కోరు అయినా.. భువీ మాత్రం వేసిన ప్రతి ఓవర్ లో ఓ వికెట్ తీయడం గమనార్హం. తొలి పవర్ ప్లే లో వరుస ఓవర్లలో వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
కానీ మరో ఎండ్ లో హార్ధిక్ పాండ్యా (3 ఓవర్లలో 31), యుజ్వేంద్ర చాహల్ (4 ఓవర్లలో 49) అక్షర్ పటేల్ (1 ఓవర్లో 19) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భువీకి తోడుగా వీళ్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసుంటే మ్యాచ్ ఫలితం కచ్చితంగా మరోలా ఉండేదనేది అభిమానుల వాదన.
ఐదు మ్యాచుల ఈ సిరీస్ లో ఢిల్లీతో పాటు కటక్ లో జరిగిన రెండు టీ20లలో దక్షిణాఫ్రికానే విజయం వరించింది. దీంతో ఆ జట్టు సిరీస్ లో 2-0 తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ లో జూన్ 14న వైజాగ్ లో మూడో మ్యాచ్ జరగాల్సి ఉంది.