కృనాల్ పాండ్యాతో గొడవ ఎఫెక్ట్, బరోడాకి గుడ్బై చెప్పిన దీపక్ హుడా... బోర్డుపై ఇర్ఫాన్ పఠాన్ సీరియస్...
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 సమయంలో కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారింది. తాజాగా ఆల్రౌండర్ దీపక్ హుడా, బరోడా జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఆల్రౌండర్ దీపక్ హుడా, బరోడా జట్టు నుంచి తప్పుకున్నాడు. తను ఇచ్చిన ఫిర్యాదుపై సరైన విచారణ చేయకుండా తనపైనే నిషేధం వేటు వేసిన బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడలేనట్టు ప్రకటించాడు. దీంతో మరోసారి బరోడా జట్టుపై, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు...
‘బరోడా క్రికెట్ అసోసియేషన్ ఇంకా ఎంతమంది సత్తా ఉన్న ఆటగాళ్లను కోల్పోతుంది. దీపక్ హుడా, బరోడా క్రికెట్ను వీడడం చాలా పెద్ద నష్టం చేకూరుస్తుంది. అతను తేలిగ్గా మరో 10 ఏళ్లు క్రికెట్ ఆడేవాడు. యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ను కోల్పోయారు. ఓ బరోడా క్రికెటర్గా ఇది నన్ను చాలా నిరుత్సాహపరిచింది’ అంటూ బరోడా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...
ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్వోసీ తెచ్చుకున్న దీపక్ హుడా, రాజస్థాన్ జట్టులో చేరబోతున్నాడని సమాచారం. ఇంతకీ దీపక్ హుడాకీ, బరోడా బోర్డుకీ, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాకి మధ్య అసలు ఏం జరిగింది...
జనవరిలో సయ్యద్ ముస్తాక్ ఆలీ 2021 టోర్నీ సమయంలో బరోడా జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న దీపక్ హుడాకి, కెప్టెన్ కృనాల్ పాండ్యాకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది... ఈ కారణంగానే టోర్నీ ఆరంభానికి ముందురోజు అర్ధాంతరంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ లీగ్ నుంచి తప్పుకున్నాడు దీపక్ హుడా...
‘నేను 11 ఏళ్లుగా బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున క్రికెట్ ఆడుతున్నాడు. ఈసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. కానీ నేను ఇప్పుడు తీవ్రమైన మనోవేదనతో నలిగిపోతున్నా. కొన్నాళ్లు మా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా, నన్ను బూతులు తిడుతూ నరకయాతన పెడుతున్నాడు...
వడోదరలోని రిలయెన్స్ స్టేడియానికి ప్రాక్టీస్కి వచ్చిన బరోడా జట్టు సభ్యుల ముందు, ఇతక క్రికెటర్ల ముందు నన్ను నానా మాటలు అన్నాడు. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కృనాల్ పాండ్యా వచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు...హెడ్ కోచ్ ప్రభాకర్ సూచనలతో ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పినా... ‘నేను కెప్టెన్ని, హెడ్ కోచ్ ఎవరు? నేనే బరోడా టీమ్...’ అంటూ బెదిరించి, దాదాగిరితో నన్ను ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకున్నాడు...
ప్రతీసారి నన్ను కించపరచాలని, కిందకి లాగేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు కృనాల్ పాండ్యా. బరోడాకి ఎలా ఆడతావో చూస్తానని, నీ క్రికెట్ కెరీర్ను నాశనం చేస్తానని చాలాసార్లు బెదిరించాడు... ఏడేళ్ల నుంచి నేను ఐపీఎల్ ఆడుతున్నా...’ అంటూ బరోడా క్రికెట్ అసోసియేషన్కి సుదీర్ఘమైన లేఖ రాశాడు దీపక్ హుడా...
కృనాల్ పాండ్యాపై కంప్లైయింట్ చేసిన హుడాకే దిమ్మతిరిగే షాక్ ఇస్తూ సస్పెషన్ వేటు వేసింది బరోడా క్రికెట్ అసోసియేషన్. హుడా కంప్లైంట్పై విచారణ చేసిన సుప్రీం కౌన్సిల్... అతనిపై ఏడాది పాటు దేశవాళీ సీజన్లో బరోడాకి ప్రాతినిధ్యం వహించకూడదంటూ నిషేధం విధించింది.
‘దీపక్ హుడా ఫిర్యాదును స్వీకరించిన బరోడా జట్టు, మేనేజర్, కోచ్, మిగిలిన ఆటగాళ్ల వద్ద నివేదికలు స్వీకరించింది. ఆ నివేదికల ఆధారంగా దీపక్ హుడా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహారించాడని తేలింది... అందుకే అతన్ని ఏడాది పాటు బరోడాకి క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’ అంటూ తెలిపింది.
ఈ సంఘటన తర్వాత ఐపీఎల్లో పాల్గొన్న దీపక్ హుడా... రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సిక్సర్ల మోత మోగించాడు. బౌలర్ ఎవరు, ఎలాంటి బాల్ అనే తేడా లేకుండా సునామీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. అయితే దీపక్ హుడా ఆడుతున్నంతసేపు కృనాల్ పాండ్యా పేరు ట్రెండింగ్లో కనిపించింది...
శివమ్ దూబే వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు, శ్రేయాస్ గోపాల్ వేసిన 14వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన దీపక్ హుడా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
2015లో ఏప్రిల్ 15న రాజస్థాన్ రాయల్స్ తరుపున 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన దీపక్ హూడా, ఆరేళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు రాజస్థాన్ రాయల్స్పై 20 బంతుల్లో అర్ధశతకం చేయడం విశేషం.
ఈ సంఘటన తర్వాత దీపక్ హుడాకి పెద్దగా క్రికెట్ ఆడేందుకు అవకాశం కూడా దొరకలేదు. దీంతో కృనాల్ పాండ్యాతో ఆగ్రహంతో పగ తీర్చుకునేందుకు ఎదురుచూసిన దీపక్ హుడా, రాజస్థాన్ రాయల్స్పై ఆ కసిని తీర్చుకున్న దీపక్ హుడా, దేశవాళీ సీజన్లో రాజస్థాన్ జట్టు తరుపున ఆడబోతుండడం విశేషం...
బరోడా తరుపున 46 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన దీపక్ హుడా... 123 టీ20 మ్యాచుల్లో పాల్గొన్నాడు. మొత్తంగా దేశవాళీ క్రికెట్లో 5600లకు పైగా పరుగులు చేసిన దీపక్ హుడా, బరోడాకి ఆల్రౌండర్గా అనేక విజయాలు అందించాడు.