భారతదేశం నా రెండో ఇల్లు, అందులో నాకు నచ్చే ప్రదేశం హైదరాబాద్... డేవిడ్ వార్నర్ ట్వీట్కి అర్థమేంటి...
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కి తెలుగువాళ్లన్నా, హైదరాబాద్ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఆడేందుకు ఎంతో ఇష్టపడే వార్నర్, ఆ జట్టుతో తెలుగువారితో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరచుకున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు కంటే సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడడానికే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేవాడు డేవిడ్ వార్నర్. అయితే ఇప్పుడు అదంతా గతంగా మారిపోబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది...
తాజాగా మరోసారి తెలుగులో తెలుగువారి కోసం ట్వీట్ చేశాడు డేవిడ్ వార్నర్... ‘నా రెండో ఇల్లు, ఇంకా భారతదేశంలో నాకు అన్నింటికన్నా నచ్చే ప్రదేశం హైదరాబాద్...’ అంటూ లవ్ సింబల్స్ పోస్టు చేశాడు...
ఇప్పటికే రెండు సార్లు తెలుగులో ట్వీట్ చేసిన డేవిడ్ వార్నర్, తాజా ట్వీట్తో ఏం చెప్పబోతున్నాడో తెలియక అయోమయానికి గురవుతున్నారు అభిమానులు... ఐపీఎల్ 2021 సీజన్లో జరిగిన అవమానం కారణంగా వార్నర్, సన్రైజర్స్ను వీడబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, ఆ తర్వాతి మ్యాచ్లో తుదిజట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
‘ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు వస్తానో రానో తెలీదు. వచ్చినా జట్టులో నాకు చోటు ఉండదు... ’, ‘నేను లేకపోయినా సన్రైజర్స్ హైదరాబాద్ ఉంటుంది. కేన్ మామ ఉన్నాడు కదా’ అంటూ ఇంతకుముందు అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు డేవిడ్ వార్నర్.
తాజా ట్వీట్తో వార్నర్, జట్టు మారేందుకు నిర్ణయం తీసుకున్నాడని అనుమానిస్తున్నారు అభిమానులు. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై అభిమానులు, కోపంగా ఉన్నారు.
డేవిడ్ వార్నర్ ఆడిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 60 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఐదు సీజన్లుగా బ్యాటింగ్లో అదరగొడుతూ ప్రతీసారి టీమ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఉంటూ వస్తున్న వార్నర్ను పక్కనబెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు.
14 సీజన్లుగా ఒకే జట్టుకి ఆడుతున్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ఎప్పుడూ ఆర్సీబీ జెర్సీలో కనిపించి, భర్త ఐపీఎల్ జట్టుకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించలేదని, కానీ డేవిడ్ వార్నర్ కుటుంబం మొత్తం ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ చేశాయని, జట్టుతో ఆయనకున్న అనుబంధానికి ఇదే ఉదాహరణ అని చెబుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ‘బ్రింగ్ బ్యాక్ వార్నర్’, ‘నో వార్నర్, నో ఎస్ఆర్హెచ్’ హ్యాష్ ట్యాగ్స్ను ట్రెండ్ చేశారు అభిమానులు. తెలుగువారితో పాటు ఈ ట్రెండింగ్లో మిగిలిన జట్ల ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా పాల్గొనడం విశేషం.
ఒకవేళ అందరూ భావించినట్టే ఐపీఎల్ 2022 వేలానికి డేవిడ్ వార్నర్ను వదిలేస్తే, అతన్ని సొంతం చేసుకునేందుకు టాప్ టీమ్లు ఎదురుచూస్తున్నాయి. అయితే వార్నర్ భాయ్ను విడుదల చేస్తే, సన్రైజర్స్ హైదరాబాద్కి ఉన్న కాస్త ఫాలోయింగ్, క్రేజ్ కూడా పోవడం ఖాయం.