ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్.. కోలుకున్న కరోనా బాధితులు.. జట్టుతో చేరిక
TATA IPL 2022: పది రోజుల క్రితం కరోనా కలవరం చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కోవిడ్-19 సోకిన ఆ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కోలుకోవడమే గాక జట్టుతో చేరారు.

శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్. పది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం కోలుకుంటున్నారు.
ఈనెల 18న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కు కరోనా సోకగా.. ఆ తర్వాత రెండో రోజులకే టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
సీఫర్ట్ క్వారంటైన్ లోనే ఉండి కరోనాను తరిమికొట్టగా మిచెల్ మార్ష్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. కాగా తాజాగా వీళ్లిద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. మంగళ, బుధ వారాల్లో నిర్వహించిన కరోనా పరీక్షలలో ఈ ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది.
ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిచెల్ మార్ష్, టిమ్ సీఫర్ట్ లు కరోనా నుంచి కోలుకుని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది. అయితే వీళ్లిద్దరూ తర్వాత మ్యాచులలో ఆడతారా..? లేదా..? అనేది మాత్రం అనుమానమే.
ఇక ఈ ఇద్దరి తర్వాత ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబంలో కూడా ఒకరికి కరోనా రావడంతో ఆయన క్వారంటైన్ కు వెళ్లాడు. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హెడ్ కోచ్ లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు అతడు కూడా క్వారంటైన్ ను పూర్తి చేసుకుని జట్టుతో కలిశాడు.
వరుసగా కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ జట్టు పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తో పూణేలో ఆడాల్సిన మ్యాచులను ముంబైలోని బ్రబోర్న్, వాంఖెడే కు తరలించారు.
కాగా శుక్రవారం ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో 7, 8 వ స్థానాలలో ఉన్న ఈ జట్లకు.. ఇక పై ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా కీలకం కానుంది. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్.. 7 మ్యాచులాడి 3 విజయాలు 4 ఓటములతో ఉంది. ఇక కేకేఆర్.. 8 మ్యాచులలో 3 విజయాలు, 5 ఓటములతో నిలిచింది. ప్లేఆఫ్ చేరాలంటే కేకేఆర్ కు రాబోయే మ్యాచులన్నీ కీలకమే.