సిడ్నీలో కరోనా కలకలం... మూడో టెస్టు వేదికగా మెల్బోర్న్... రోహిత్ శర్మ రాకపై డౌట్స్...
దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా సిడ్నీ నగరంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు సిడ్నీ వేదికగా జరగాల్సి ఉంది. కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలోనే లాక్డౌన్ విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం... సిడ్నిలో రెండో, మూడో టీ20 మ్యాచులను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించింది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.
సిడ్నీ నగరంలో కరోనా టెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణంగా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆస్ట్రేలియా ప్లేయర్లు డేవిడ్ వార్నర్, సీన్ అబ్బాట్ రెండో టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
బయో సెక్యూలర్ జోన్కి అవతల ఈ ఇద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవడంతో తిరిగి జట్టుతో కలిసేందుకు 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది...
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ సిడ్నీ క్రికెట్ స్టేడియంలోనే మూడో టెస్టు నిర్వహించి తీరుతామని కొన్నిరోజుల క్రిందట ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
అయితే కరోనా మహమ్మరి ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తూ ఉండడంతో నిర్ణయం మార్చుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా... మూడో టెస్టుకి ప్రత్యామ్నాయ వేదికగా మెల్బోర్న్ను ఎంపిక చేసింది.
కరోనా కేసులు విపరీతంగా పెరిగితే మూడో టెస్టును స్టాండ్ బై వేదికైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తామని ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు...
చివరి రెండు టెస్టుల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ... సిడ్నీలోనే క్వారంటైన్లో గడుపుతున్నాడు...
మూడో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతుండడంతో అతనికి అక్కడే క్వారంటైన్ ఏర్పాట్లు చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే రోహిత్ శర్మ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ, అతనితో బీసీసీఐ అధికారులు రోజూ మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారని చెప్పింది.
14 రోజుల క్వారంటైన్ను ముగించుకుని డిసెంబర్ 30న భారత జట్టుతో కలవనున్నాడు రోహిత్ శర్మ. బాక్సింగ్ డే ముగిసిన తర్వాత టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటాడు రోహిత్ శర్మ.