అతని ఆట చూస్తే, దండం పెట్టినా తప్పులేదు... ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమ్మిన్స్ హాట్ కామెంట్స్...
ఛతేశ్వర్ పూజారా టెస్టు కెరీర్లో బ్రిస్బేన్ టెస్టు ఆఖరి రోజు ఆడిన ఇన్నింగ్స్కి చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. ఆసీస్ బౌలర్ల బౌన్సర్లకు తన శరీరాన్ని అడ్డుగా పెట్టి, అద్భుతమైన పోరాటం చూపించాడు పూజారా. పూజారా ఇన్నింగ్స్ చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని కామెంట్ చేశాడు ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్...
‘నేను నా కెరీర్లో చూసిన డేరింగ్ ఇన్నింగ్స్ అదే... ఛతేశ్వర్ పూజారా ఓ క్లాస్ ప్లేయర్. గబ్బా టెస్టులో అతని ఇన్నింగ్స్ చూసి, ఇతనికేమైనా పిచ్చా? అనుకున్నా...
ఛతేశ్వర్ పూజారాతో కలిసి రిషబ్ పంత్ ఆడడం మనం టెస్టు క్రికెట్లోనే చూడగలం. రెండు భిన్నమైన వ్యక్తిత్వాలున్న ప్లేయర్లు కలిసి ఆడుతుంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే నాకు టెస్టులంటే చాలా ఇష్టం...
వాస్తవానికి నేనెప్పుడూ ఛతేశ్వర్ పూజారాతో మాట్లాడలేదు. కానీ ఆ ఇన్నింగ్స్ తర్వాత నాకు పూజారా గురించి చాలా తెలుసని అనిపిస్తోంది. అతనికి మొండి పట్టుదల చాలా ఎక్కువ. టీమిండియాలో అతనో స్ట్రాంగ్ రాతి గోడ.
నిజానికి మొదటి మూడు టెస్టుల్లో ఛతేశ్వర్ పూజారా నుంచి మేం ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ రాలేదు. అతను ఆరు ఇన్నింగ్స్ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. మేం ఈజీగా గెలిచేస్తామని అనుకున్నాం.
కానీ సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో, గబ్బా టెస్టులో అతను ఆడిన ఇన్నింగ్స్లు మా నుంచి విజయాలను దూరం చేశాయి. ముఖ్యంగా గబ్బాలో అతను ఆడిన ఇన్నింగ్స్, మమ్మల్ని మానసికంగా దెబ్బతీశాయి.
ఏ క్రికెటర్ అయినా అవుట్ కాకుండా ఉండేందుకు శరీరాన్ని అడ్డుపెట్టుకుంటాడా? ఎన్ని దెబ్బలు తగులుతున్నా, మళ్లీ నిల్చొని బ్యాటింగ్ చేసేందుకు సిద్ధపడతాడా? అతను పంటిబిగువున నొప్పిని భరిస్తూ ఆడిన ఇన్నింగ్స్కి దండం పెట్టినా తప్పులేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.
ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర క్రియేట్ చేసింది. ఆఖరి టెస్టు ఆఖరి రోజున శుబ్మన్ గిల్, రిషబ్ పంత్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా... 211 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ప్యాట్ కమ్మిన్స్, హజల్వుల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో దాదాపు 12 బౌన్సర్లు, ఛతేశ్వర్ పూజారా ఒంటికి బలంగా తాకాయి. అయినా నొప్పిని భరిస్తూనే ఇన్నింగ్స్ కొనసాగించిన పూజారా, మిగిలిన ప్లేయర్లలో గెలుపు కసిని పెంచాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ 89 పరుగులు చేసి భారత జట్టుకి చారిత్రక విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.
2020-21 బోర్డర్ గవాస్కర్ సిరీస్లో 21 వికెట్లు తీసిన ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్కి ఆఖరి మ్యాచ్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.