- Home
- Sports
- Cricket
- పంత్కు యాక్సిడెంట్.. బుమ్రాకు సర్జరీ..! చేతన్ శర్మ చెప్పిందే నిజం కాబోతుందా..? టీమిండియాలో ఏం జరుగుతోంది..?
పంత్కు యాక్సిడెంట్.. బుమ్రాకు సర్జరీ..! చేతన్ శర్మ చెప్పిందే నిజం కాబోతుందా..? టీమిండియాలో ఏం జరుగుతోంది..?
భారత జట్టు యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మంచపట్టాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సుమారు ఆరేడు నెలలుగా క్రికెట్ కు దూరంగానే ఉన్నాడు. తాజాగా అతడికి సర్జరీ కూడా చేయాలని వార్తలు వస్తున్నాయి.

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో పాటు పాటు టీమిండియాకు గాయాల బెడద తరుచూ వేధిస్తూనే ఉంటున్నది. కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడు ఫిట్ గా ఉంటాడు..? ఏ సిరీస్ కు అందుబాటులో ఉంటాడనేది అతడు మ్యాచ్ లో బరిలో దిగేదాకా తెలియదు. వీళ్లే గాక వన్డేలలో కీలక బ్యాటర్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ కూడా తరుచూ గాయాల బాధితుడే.
కీలక ఆటగాళ్లు లేకపోవడంతో ఫలితాలు ఏవిధంగా ఉంటాయనేది రోహిత్ అండ్ కో.కు ఇటీవలే ప్రత్యక్ష అనుభవం కూడా అయింది. గతేడాది ఆసియా కప్ లో తొలి మ్యాచ్ మాత్రమే ఆడి ఆ తర్వాత గాయంతో రవీంద్ర జడేజా దూరం కావడంతో ఆ టోర్నీతో పాటు అతడు నవంబర్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కూ దూరమయ్యాడు.
బుమ్రా కూడా గతేడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత గాయంతో చాలాకాలం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అతడిని టీ20 ప్రపంచకప్ ఆడించాలని బీసీసీఐ అత్యాశ ప్రదర్శించినా అది మొదటికే మోసం వచ్చింది. సెప్టెంబర్ లో బుమ్రా ఫిట్ గా లేకున్నా అతడిని తీసుకొచ్చి ఆస్ట్రేలియాతో రెండు టీ20లు ఆడించింది. దీంతో అతడి గాయం తిరగబెట్టి అది మొదటికే మోసం వచ్చింది. ఆస్ట్రేలియా పిచ్ లపై బుమ్రా లేకపోవడంతో భారత్ ఏం కోల్పోయిందో అభిమానులతో పాటు రోహిత్ శర్మకు ముఖ్యంగా బీసీసీఐకి బాగా అర్థమైంది.
తాజాగా టీమిండియా పరిస్థితి చూస్తుంటే గతేడాది నవంబర్ పరిస్థితులే కీలక టోర్నీలలో పునరావృతమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వన్డేలలో మంచి రికార్డు ఉన్న పంత్.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నాడు. అతడు కోలుకోవడానికి ఏడెనిమిది నెలలు (అధికారికంగానే.. అనధికారికంగా ఇంకా ఎక్కువుండొచ్చు..) పట్టొచ్చని బీసీసీఐ చెబుతుంది.
ఇక ఇప్పుడు బుమ్రా కూడా వెన్నునొప్పితో సర్జరీకి వెళ్లాలని బీసీసీఐ సూచిస్తోంది. సర్జరీ చేస్తే బుమ్రా నాలుగైదు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాల్సిందే. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ (అక్టోబర్) వరకైనా అందుబాటులో ఉంటారా..? అన్నది అనుమానాలకే అనుమానం వేసే ప్రశ్న. బుమ్రా, పంత్ లు భారత వన్డే జట్టుకు ఎంత కీలకమన్నది అందరికీ తెలిసిందే.
దీనికి తోడు త్వరలోనే ఐపీఎల్ జరగాల్సి ఉంది. గతేడాది ఐపీఎల్ లో భారత కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు గాయాలపాలై సీజన్ ను ముగించారు. ఇప్పుడు మార్చి వారాంతంలో మొదలై మే వరకు జరిగే ఈ సీజన్ లో ఎవరు ఫిట్ గా ఉంటారో..? ఎవరికి గాయాలవుతాయో..? అంతుచిక్కని ప్రశ్నే. జాతీయ జట్టుకు అంటే చూసీ చూడనట్టు వదిలేసే మన క్రికెట్ వీరులు.. ఐపీఎల్ అంటే మాత్రం ఎక్కడలేని పట్టుదలతో ఆడతారు. ఆ క్రమంలో గాయాల పాలైతే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.
ఇవన్నీ చూస్తుంటే రెండు వారాల క్రితం ఓ టీవీ ఛానెల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తోంది. టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు మ్యాచ్ ఆడటానికి వంద శాతం ఫిట్ గా లేకున్నా ఇంజక్షన్లు తీసుకుంటారని, వాటి ద్వారా మ్యాచ్ లలో పాల్గొంటరాని చెప్పిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ నాటికైనా ఈ గాయాల బెడద తీరుతుందో లేక చేతన్ శర్మ చెప్పినట్టే క్రికెటర్లు ఇంజక్షన్ల బాట పడుతారో చూడాలి మరి....!!