డెక్కన్ ఛార్జర్స్ జట్టును అన్యాయంగా తొలగించిన కేసులో బీసీసీఐకి ఊరట... భారీ నష్టపరిహారం చెల్లించాల్సిన...
ఐపీఎల్లో తెలుగు టీమ్గా సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్నప్పటికీ, డెక్కన్ ఛార్జర్స్ ఉన్నప్పుడు ఏర్పడిన ఎమోషన్ వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగువారందరూ డెక్కన్ ఛార్జర్స్ను సొంత టీమ్గా భావించేవాళ్లు. ఈ టీమ్ను అర్ధాంతరంగా తొలిగించిన ఐపీఎల్ యాజమాన్యానికి భారీ ఊరట దక్కింది...
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) కంపెనీ ఆధ్వర్యంలో 2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీజన్లో దారుణమైన పర్ఫామెన్స్తో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన డెక్కన్ ఛార్జర్స్, 2009లో టైటిల్ గెలిచింది.
ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ, హర్షల్ గిబ్స్, డ్వేన్ స్మిత్, ఆండ్రూ సైమండ్స్, ఓజా, ఆర్పీ సింగ్ వంటి ప్లేయర్లతో అదిరిపోయే ఆటతీరుతో 2009లో టైటిల్ ఛాంపియన్గా నిలిచింది డెక్కన్ ఛార్జర్స్...
అయితే 2012లో బ్యాంకు గ్యారెంటీగా చూపించాల్సిన రూ.100 కోట్లను చూపించడంలో డెక్కన్ ఛార్జర్స్ విఫలమైంది. బీసీసీఐ, బ్యాంకు గ్యారెంటీ చూపించాల్సిందిగా డెక్కన్ క్రానికల్కి షోకాజ్ నోటీసులు పంపింది...
డెక్కన్ ఛార్జర్స్కు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. అయితే అది ఇంకా పూర్తికాకముందే 2012 సెప్టెంబర్లో డెక్కన్ ఛార్జర్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఐపీఎల్ యాజమాన్యం, ఆ స్థానంలో మరో కొత్త జట్టు కోసం నామినేషన్లను ఆహ్వానించింది.
గడువు ఇంకా పూర్తికాకముందే జట్టును తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై డెక్కన్ ఛార్జర్స్ యాజమాన్య సంస్థ డెక్కన్ క్రానికల్, బాంబే హై కోర్టును ఆశ్రయించింది...
ఐపీఎల్లో కొన్ని ఫ్రాంఛైజీలు చట్ట విరుద్దమైన స్పాట్ ఫిక్సింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడినా కూడా చిన్నచిన్న శిక్షలతో సరిపెట్టిన ఐపీఎల్ యాజమాన్యం, తమ జట్టును మాత్రం బ్యాంకు గ్యారెంటీ చూపించాల్సిన గడువు కూడా తీరకముందే బ్యాన్ చేసిందంటూ ఆరోపించింది...
ఇలా అర్ధాంతరంగా ఫ్రాంఛైజీని రద్దు చేయడం వల్ల సంస్థకు భారీ నష్టం జరిగిందని, నష్టపరిహారం ఇతర ఖర్చుల కింద బీసీసీఐ, రూ.8 వేల కోట్లు చెల్లించాలంటూ డెక్కన్ క్రానికల్స్ కోరింది...
ఈ పిటిషన్ను విచారించిన బాంబే హై కోర్టు, వాదోపవాదనలు విని, జట్టును రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని తేల్చింది. నష్టపరిహారంగా డెక్కన్ క్రానికల్స్కి రూ.4814.67 కోట్లు చెల్లించాలని, దీనికి 2012 నుంచి ఏటా 10 శాతం వడ్డీ, కోర్టు ఖర్చులు, ఇతరత్రా ఖర్చుల కింద మరో రూ.50 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది...
బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పును బీసీసీఐ సవాల్ చేసింది. దీంతో మరోసారి పిటిషన్పై విచారణ చేసిన ధర్మాసనం... ఇంతకుముందు రూ.4800+ కోట్లు చెల్లించాలంటూ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది... డెక్కన్ ఛార్జర్స్ బ్యాంకు గ్యారెంటీ చూపించడంలో విఫలం కావడంతోనే జట్టును రద్దు చేసినట్టు బీసీసీఐ వాదనతో ఏకీభవించింది.
దీంతో డెక్కన్ ఛార్జర్స్ జట్టు పోరాటానికి మరోసారి చుక్కెదురైంది. బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పుపై డెక్కన్ క్రానికల్ సంస్థ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంది.
డెక్కన్ ఛార్జర్స్ను రద్దు చేసిన తర్వాత సన్టీవీ ఆధ్వర్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్ 2013 నుంచి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే డెక్కన్ ఛార్జర్స్తో పోలిస్తే సన్రైజర్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ రెండూ తక్కువే.