ఇదేగా తొలి మ్యాచ్.. కాస్త టైమ్ ఇవ్వండి.. పంత్ కు మద్దతుగా సీనియర్ బౌలర్
IND vs SA T20I: ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా తాత్కాలిక సారథి రిషభ్ పంత్ నిర్ణయాలను అందరూ తప్పుబట్టారు. అయితే పంత్ కు టీమిండియా సీనియర్ పేసర్ మద్దతుగా నిలిచాడు.

దక్షిణాఫ్రికాతో ఢిల్లీలో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు ఓటమికి బౌలర్ల వైఫ్యలంతో పాటు తాత్కాలిక సారథి రిషభ్ పంత్ నిర్ణయాలు, వ్యూహాలు బెడిసికొట్టాయి. దీంతో అందరూ అతడి కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే పంత్ కు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ మద్దతుగా నిలిచాడు. అతడు యంగ్ కెప్టెన్ అని.. అంతర్జాతీయంగా కెప్టెన్ గా అతడికి ఇదే తొలి మ్యాచ్ అవడం వల్ల కాస్త తడబడ్డాడని అన్నాడు. రాబోయే మ్యాచులలో పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
భువీ మాట్లాడుతూ.. ‘అతడు యంగ్ కెప్టెన్. కెప్టెన్ గా అతడికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిరీస్ లో రాబోయే మ్యాచ్ లలో అతడు రాణిస్తాడు. మ్యాచులు గెలవాలంటే కెప్టెన్ ఒక్కడు సరిగా ఉంటేనో.. ఒక్క ఆటగాడు రాణిస్తేనో కాదు.. సమిష్టిగా ఆడితేనే విజయం దక్కుతుంది.
తొలి మ్యాచ్ లో మా బౌలింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. మేము బాగా బౌలింగ్ చేసి మ్యాచ్ గెలిచుంటే అందరూ పంత్ నిర్ణయాలను మెచ్చుకునేవారు. రాబోయే మ్యాచులలో మా బౌలింగ్ ను మెరుగుపరుచుకుంటామని ఆశిస్తున్నా..’ అని తెలిపాడు.
అంతేగాక తొలి మ్యాచ్ లో సఫారీలను గెలిపించిన డేవిడ్ మిల్లర్ పై కూడా భువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అతడు ఆడకూడదని కోరుకుంటున్నానని, మిల్లర్ కు బౌలింగ్ చేయడం కష్టమని చెప్పుకొచ్చాడు.
‘మిల్లర్ కు బౌలింగ్ వేయడం కష్టం. అతడి ఫామ్ చూస్తుంటే కొండంత లక్ష్యమైనా పిండి చేసేలా ఉన్నాడు. కటక్ మ్యాచ్ లో అతడు ఆడకూడదని నేను కోరుకుంటున్నాను (నవ్వుతూ).. దక్షిణాఫ్రికా జట్టు అతడిని ఆడించకుంటే బాగుండు..
ఐపీఎల్ లో మిల్లర్ అద్భుతంగా రాణించాడు. అతడి సామర్థ్యమేంటో మాకు తెలుసు. మిల్లర్ కు బౌలింగ్ వేయడం ఎప్పుడూ సవాల్ తో కూడుకున్నదే..’ అని తెలిపాడు. ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం కటక్ లో రెండో టీ20 జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.