దాదాకు బర్త్ డే విషెస్.. స్వయంగా గంగూలి ఇంటికెళ్లిన మమతా బెనర్జీ (ఫోటోలు)
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనా, వసీం జాఫర్, ప్రజ్ఞాన్ ఓఝా, మహ్మద్ కైఫ్ సహా పలువురు తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా బర్త్ డే విషెస్ తెలిపాయి.
సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. కోల్కతాలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేశాడు. తన సహోద్యోగులు ఏర్పాటు చేసిన ఈ కేక్ కట్టింగ్ సెలెబ్రేషన్స్లో పాల్గొన్న దాదా చిరునవ్వులు చిందుస్తూ కేక్ కట్ చేశాడు.
ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్, యూరో, కోపా అమెరికా ఫుట్బాల్, ఒలింపిక్స్కు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కరోనా కారణంగా తన బర్త్డేను చాలా సింపుల్గా జరుపుకున్నట్లు దాదా తెలిపాడు. అనుకోకుండా ఏర్పాటు చేసిన కార్యక్రమమేన, ప్రీ ప్లాన్ కాదన్నాడు.
బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా గంగూలీ ఇంటికి వెళ్లి మరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గంగూలీ నివాసంలో కొద్దిసేపున్న మమతా.. దాదా కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు. ఇక సౌరవ్కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు గంగూలీకి విషెస్ తెలియజేశారు.
భారత్ తరఫున 113 టెస్ట్లు, 311 వన్డేలు ఆడిన దాదా.. రెండు ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. మొత్తం 195 మ్యాచ్లకు సారథ్యం వహించిన దాదా.. 97 మ్యాచ్ల్లో విజయాలందించాడు.