చెప్పకుండా బయటికి ఎందుకెళ్లారు... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలను వివరణ కోరిన బీసీసీఐ...
ఇంగ్లాండ్ టూర్లో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లు, ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడడం, బీసీసీఐని షాక్కి గురి చేసింది. కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడ్డారనే విషయం కంటే, కరోనా ప్రోటోకాల్ను బ్రేక్ చేస్తూ వాళ్లు చేసిన పనే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది...
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడినట్టు తేలిన విషయం తెలిసిందే. రవిశాస్త్రితో పాటు భారత కోచింగ్ సిబ్బంది మరో ముగ్గురు కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్కి వెళ్లారు...
ఐదోరోజు సోమవారం ఉదయం నిర్వహించిన RT-PCR పరీక్షల్లో కూడా రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్తో పాటు భారత ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటల్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది...
దీంతో మాంచెస్టర్లో జరిగే ఐదో టెస్టులో వీళ్లెవ్వరూ అందుబాటులో ఉండడం లేదు. కేవలం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రమే జట్టుకి అందుబాటులో ఉన్నాడు...
ప్రస్తుతం భారత జట్టు, లండన్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏర్పాటుచేసిన బయో సెక్యూలర్ జోన్లోనే కుటుంబసభ్యులతో కలిసి బస చేస్తోంది. అలాంటిది రవిశాస్త్రికి వైరస్ ఎలా సోకిందనే కోణంలో ఈసీబీ అధికారులు దర్యాప్తు చేసింది..
భారత హెడ్కోచ్ రవిశాస్త్రితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరికొందరు క్రికెటర్లు కలిసి మంగళవారం రాత్రి ఇంగ్లాండ్లోని విక్టోరియా ఏరియాలో ఉన్న సెయింట్ జెమ్స్ కోర్ట్ హోటల్లో తన పుస్తక ఆవిష్కరణకు హాజరయ్యాడు...
ఈ హోటెల్లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో రవిశాస్త్రి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ విషయం గురించి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి కానీ బీసీసీఐకి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదట...
ఈ వేడుకకి చాలా మంది అతిథులు రావడంతో వారిలో ఎవరి ద్వారానైనా రవిశాస్త్రికి వైరస్ సోకి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు అధికారులు....
లండన్లో గత వారం రోజుల్లో 21 వేల కొత్త కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి పరిస్థితులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఇలా చెప్పాపెట్టుకుండా పార్టీలు, సమావేశలకు హాజరుకావడంపై విమర్శలు వస్తున్నాయి...
టెస్టు మ్యాచ్ మధ్యలో ఇలా అర్ధాంతరంగా ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరు కావాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటూ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలను వివరణ కోరింది బీసీసీఐ...
అదృష్టవశాత్తు భారత జట్టులోని క్రికెటర్లు ఎవ్వరూ కరోనా బారిన పడలేదు. అదే జరిగి ఉంటే, నాలుగో టెస్టును మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చేది. అదే జరిగితే భారత క్రికెట్ జట్టు పరువు పోయేది...
ఈ విధంగా ఇంగ్లాండ్ టూర్లో చెప్పాపెట్టకుండా కరోనా ప్రోటోకాల్ బ్రేక్ చేసినందుకు ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. అయితే బీసీసీఐ మాత్రం అలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోకపోవచ్చు..