ఈసారికి 8 జట్లే... కొత్తగా రెండు ఐపీఎల్ జట్ల కోసం టెండర్లు అప్పుడే... కీలక నిర్ణయాలు తీసుకున్న బీసీసీఐ...
అహ్మదాబాద్లో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీసీసీఐ. వచ్చే ఏడాది భారత్ వేదికగా నిర్వహించబోయే టీ20 వరల్డ్కప్ వేదిక, నిర్వహణలతో పాటు ఐపీఎల్లో అదనపు జట్లను చేర్చే విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు టాక్. 2021 సీజన్కి పెద్దగా సమయం లేనందున 2022 సీజన్లో 10 జట్లను ఆడించేందుకు బీసీసీఐ ఏజీఎమ్ (Annual General meeting) అంగీకరించినట్లు సమాచారం.
వచ్చే ఏడాది 8 జట్లే ఐపీఎల్ 14వ సీజన్ బరిలో దిగుతున్నాయి. అదనపు జట్లను తీసుకొచ్చేందుకు సరిపడా సమయం లేనందున, కొత్త ఫ్రాంఛైజీలను 2022 సీజన్లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
2022 సీజన్లో అదనంగా రెండు కొత్త ఫ్రాంఛైజీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇందుకోసం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో టెండర్లను ఆహ్వానించనుంది భారత క్రికెట్ బోర్డు...
అలాగే ఆటగాళ్లకు శిక్షణనిచ్చే జాతీయ క్రికెట్ అకాడమీని కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే ఉన్న ఎన్సీఏను, దేశవ్యాప్తంగా ఐదు జోన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఎన్సీఏలో క్రికెటర్లకు శిక్షకుడిగా వ్యవహారిస్తున్న మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న బీసీసీఐ, జాతీయ క్రికెట్ అకాడమీని ఐదు ప్రత్యేకమైన జోన్లలో ఏర్పాటు చేయడం వల్ల యువక్రికెటర్ల ప్రతిభను మరింత మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
అలాగే క్రికెటర్ల ఇన్సురెన్స్ మొత్తాన్ని కూడా రెట్టింపు చేసింది బీసీసీఐ. 5 లక్షల భీమాను 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు...
అలాగే అంపైర్లు, రిఫరీల రిటైర్మెంట్ వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు...
కరోనా కారణంగా నిలిచిపోయిన వుమెన్స్ క్రికెట్ను వచ్చే ఏడాది మళ్లీ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు మొదలెట్టిన బీసీసీఐ, జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ముగిసిన తర్వాత వుమెన్స్ దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభించాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే భారత మహిళా జట్టు టెస్టు క్రికెట్ను వచ్చే ఏడాది నుంచి నిరంతరాయంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న బీసీసీఐ, అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించింది.
అదనపు జట్లను చేర్చాలనే నిర్ణయం 2022 సీజన్కి వాయిదా వేయడంతో మెగా వేలం కూడా 2022లోనే నిర్వహించబోతున్నారు. 2021 సీజన్కి సంబంధించిన మినీ వేలం ఫిబ్రవరి 2021లో జరగనుంది.