కుర్రాళ్లొస్తున్నారు.. మీరు వెళ్తారా..? వెళ్లగొట్టమంటారా..? రోహిత్-కోహ్లీలకు బీసీసీఐ ఆదేశం..!
వయసుతో పాటు ఆట కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడకపోవడంతో ఈ ఇద్దరినీ షార్టెస్ట్ ఫార్మెట్ నుంచి తప్పించి కేవలం వన్డే, టెస్టులకు పరిమితం చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఈ ఇద్దరికీ గట్టిగానే చెప్పినట్టు...
దశాబ్దకాలంగా భారత జట్టు బ్యాటింగ్ కు కర్త, కర్మ, క్రియ అయిన టీమిండియా తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు టీ20 ఫార్మాట్ నుంచి శాశ్వతంగా పంపించే యత్నాలు ఊపందుకున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.
వయసుతో పాటు ఆట కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడకపోవడంతో ఈ ఇద్దరినీ షార్టెస్ట్ ఫార్మెట్ నుంచి తప్పించి కేవలం వన్డే, టెస్టులకు పరిమితం చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఈ ఇద్దరికీ గట్టిగానే చెప్పినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కుర్రాళ్లతో కూడిన జట్టును తయారుచేయాలని, వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి వారిని తీర్చిదిద్దాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది.
ఇందులో భాగంగానే హార్ధిక్ పాండ్యాను కొత్త సారథిగా నియమించడం.. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుండటం వంటి వాటికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇటీవలే ముగిసిన శ్రీలంకతో సిరీస్ లో ఇందుకు సంబంధించిన టెస్ట్ ఫైర్ కూడా పూర్తయింది. లంకతో టీ20 సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుపొందింది.
అదీగాక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (భారత్ క్వాలిఫై అయితే) కూడా ఉన్న నేపథ్యంలో సీనియర్లు వాటిమీదే దృష్టి సారించాలని, టీ20లను వీలైనంత త్వరలో వదిలేస్తే మంచిదని ఈ ఇద్దరికీ చెప్పినట్టు సమాచారం.
ఒకవైపు బీసీసీఐ పెద్దలు రోహిత్, కోహ్లీలను టీ20ల నుంచి దిగిపొమ్మని ఆదేశాలు జారీ చేస్తుంటే హిట్ మ్యాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నిన్న విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘వరుసగా మ్యాచ్ లు ఆడటం కష్టం. ఆటగాళ్లకు విశ్రాంతి అవసరం. నాకు కూడా అప్పుడప్పుడూ బ్రేక్ వస్తుంది. న్యూజిలాండ్ తో టీ20లు ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ కూడా ఉంది. నేనైతే ఈ ఫార్మాట్ ను వదిలిపెట్టలేదు..’అని చెప్పడం గమనార్హం.
అయితే కివీస్ తో వన్డే సిరీస్ లో ఈ ఇద్దరూ తప్పకుండా భాగమైనా టీ20లలో మాత్రం ఆడేది అనుమానమే. సెలక్టర్లు కూడా యువ భారత్ నే ప్రోత్సహించాలని భావిస్తున్న తరుణంలో రోహిత్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరి బీసీసీఐ ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.