డబ్ల్యూపీఎల్కు మరిన్ని హంగులు.. వచ్చే సీజన్ నుంచి హోం అండ్ అవే మ్యాచ్లు..!
WPL: ఈ ఏడాది మార్చి 4 నుంచి 26 వరకు ముంబై వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.

Image credit: PTI
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి బీసీసీఐ దీనికి అదనపు హంగులు అద్దనుంది. ఐపీఎల్ లో మాదిరిగానే డబ్యూపీఎల్ లో కూడా హోం అండ్ అవే మ్యాచ్ లను తీసుకురానుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఈ ఏడాది మార్చి 4 నుంచి 26 వరకు ముంబై వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. అసలు ఈ లీగ్ చూడటానికి ఎవరైనా వస్తారా..? అన్న అనుమానాల నుంచి కొన్ని మ్యాచ్ లకు స్టేడియాలు హౌస్ ఫుల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్ లో కూడా టీమ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది.
Image credit: PTI
ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ కు వచ్చే సీజన్ నుంచి మరిన్ని హంగులు అద్దేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఐపీఎల్ లో మాదిరిగానే డబ్ల్యూపీఎల్ లో కూడా హోం అండ్ అవే (ఇంటా బయటా) మ్యాచ్ లను ఆడించాలని భావిస్తున్నది. డబ్ల్యూపీఎల్ లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ ఉన్నాయి.
దీని ప్రకారం.. వచ్చే సీజన్ నుంచి అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో, ఢిల్లీలో సొంత ప్రేక్షకుల మద్దతుతో టీమ్స్ మ్యాచెస్ ఆడతాయి. అయితే ఇది అంత వీజీ కాదు. ముంబైలో రెండు స్టేడియాలలో తక్కువ ధరకే టికెట్లను ఇవ్వడం, మహిళలకు ఉచితంగా ఎంట్రీ అనడంతో స్టేడియాలు కళకళలాడాయి. ఐపీఎల్ లో మాదిరిగా టికెట్లకు వేలకు వేలు పోసి మహిళల లీగ్ చూస్తారా..? లేక నష్టపోయినా సరే ఇదే ప్లాన్ ను అమలుచేస్తారా..? చూడాలి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక డబ్ల్యూపీఎల్ ను ఈ ఏడాది మార్చిలో నిర్వహించగా వచ్చే సీజన్ నుంచి దీపావళి సమయంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఐదు టీమ్స్ మధ్య తక్కువ లీగ్ మ్యాచ్ లు ఉండటంతో ప్రారంభ ఎడిషన్ 22 రోజుల్లో ముగిసింది. కానీ రాబోయే రోజుల్లో లీగ్ మ్యాచ్ లు పెరిగే అవకాశముంది. అదీగాక మూడేండ్ల తర్వాత డబ్ల్యూపీఎల్ లోకి కొత్త టీమ్ లు కూడా రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో మార్చిలో డబ్ల్యూపీఎల్ ను నిర్వహించడం కాస్త రిస్కే. ఎందుకంటే ప్రతీ యేటా ఐపీఎల్ సీజన్ మార్చి నెలాఖరునే మొదలవుతుంది. రెండు నెలల పాటు సాగే ఈ సీజన్ లో పెద్దగా మార్పులుండవు. దీంతో డబ్ల్యూపీఎల్ లో కూడా మ్యాచ్ లు పెరిగితే రెండూ క్లాష్ అయ్యే అవకాశముంది. ఈ సమస్యలు తలెత్తకుండా మార్చిలో కాకుండా దీపావళికి డబ్ల్యూపీఎల్ ను షిఫ్ట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది.