- Home
- Sports
- Cricket
- IPL 2022: వేలానికి వేళాయే.. ఫిబ్రవరిలో ఐపీఎల్ మెగా యాక్షన్..? హైదరాబాద్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..
IPL 2022: వేలానికి వేళాయే.. ఫిబ్రవరిలో ఐపీఎల్ మెగా యాక్షన్..? హైదరాబాద్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..
IPL Mega Auction: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది.

కొద్దిరోజులుగా భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేదీలు ఖరారు చేసింది.
2022 ఫిబ్రవరి 7, 8 వ తేదీలలో ఐపీఎల్ మెగావేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు అనధికారికంగా తెలిపారు.
సదరు అధికారి మాట్లాడుతూ.. ‘కొవిడ్ పరిస్థితులు మరింత దిగజారకపోతే భారత్ లోనే ఐపీఎల్ మెగా వేలం నిర్వహిస్తాం. రెండ్రొజుల పాటు దీనిని బెంగళూరులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అందుకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతున్నాయి..’ అంటూ పేర్కొన్నారు.
సాధారణంగా ముంబైలో జరిగే ఐపీఎల్ మెగావేలాన్ని ఈసారి హైదరాబాద్ లో గానీ బెంగళూరు లో గానీ నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భావించింది. అయితే మెగా వేలం వేదిక హైదరాబాద్ అవుతుందని ఇక్కడి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ బీసీసీఐ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లింది.
ఇదిలాఉండగా.. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేలాన్ని దుబాయ్ లో నిర్వహించాలని కూడా బీసీసీఐ పెద్దలు ప్రతిపాదించినట్టు సమాచారం.
పరిస్థితులు చేయి దాటితే మాత్రం వేదికను మార్చే అవకాశముంది. అయితే దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ దీని మీద అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు వచ్చిన విషయం తెలిసిందే.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల బిడ్ ల ప్రక్రియలో లక్నో, అహ్మాదాబాద్ లు కొత్త ఫ్రాంచైజీలుగా వచ్చాయి. అయితే.. అహ్మాదాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం.. సీవీసీ క్యాపిటల్స్ బెట్టింగ్ సంస్థలతో ఒప్పందాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
వాటిపై బీసీసీఐ ఇంకా తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. దీంతో లక్నో, అహ్మాదాబాద్ లకు సంబంధించిన ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను కూడా బీసీసీఐ పొడిగించిన విషయం తెలిసిందే.