శ్రీశాంత్తో పాటు బ్యాన్కి గురైన ముంబై క్రికెటర్పై నిషేధాన్ని తొలగించిన బీసీసీఐ...
ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడి, జీవితకాల నిషేధానికి గురైన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అంకిత్ ఛావన్పై బ్యాన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. క్రికెటర్ శ్రీశాంత్తో పాటు అజిత్ చంఢీలా, అంకిత్ ఛావన్లపై జీవిత కాలం నిషేధం విధించిన బీసీసీఐ... తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది.
2008లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యులుగా ఉన్న శ్రీశాంత్, అజిత్ చంఢీలా, అంకిత్ ఛావన్లు స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడినట్టు 2013లో ఆరోపణలు ఎదుర్కొన్నారు...
ఈ ముగ్గురిపై ప్రొఫెషనల్ క్రికెట్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. అయితే శ్రీశాంత్ మళ్లీ మళ్లీ పిటిషన్లు వేయడంతో అతనిపై నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది...
గత ఏడాది బ్యాన్ కాలం పూర్తి చేసుకున్న శ్రీశాంత్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ద్వారా మళ్లీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2021 వేలానికి రిజిస్టర్ చేయించుకున్నప్పటికీ, షార్ట్ లిస్టులో అతనికి చోటు దక్కలేదు...
తాజాగా అంకిత్ ఛావన్పై విధించిన జీవిత కాల నిషేధాన్ని కూడా ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయ తీసుకుంది బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు సీఈవో హేమాంగ్ అమీన్, ఈ ముంబై స్పిన్నర్కి ఈ విషయాన్ని తెలియచేశాడు... దీంతో అతనిపై విధించిన నిషేధం గత ఏడాది సెప్టెంబర్తో ముగిసింది.
ఈ వార్త తెలియగానే అంకిత్ ఛావన్, తిరిగి క్రికెట్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తన ఆనందాన్ని తెలియచేశాడు. 36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ ఆడే అవకాశం రావడం ఓ అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపాడు.
‘ఈ వార్త వినగానే నేను ఎలా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను. గ్రౌండ్లో అడుగుపెట్టేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా. నాకు సహకరించిన బీసీసీఐకి, ముంబై క్రికెట్ అసోసియేషన్కి ధన్యవాదాలు...’ అంటూ తెలిపాడు అంకిత్ ఛావన్.
తన కెరీర్లో 18 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అంకిత్ ఛావన్, 26 టీ20 మ్యాచులు, 20 లిస్టు ఏ మ్యాచులు ఆడి మొత్తంగా 90 వికెట్లు పడగొట్టాడు. అదీగాక అతని పేరు మీద రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ కూడా ఉంది.
ఐపీఎల్లో 13 మ్యాచులు ఆడిన రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్, 8 వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో ఎదుగుతున్న దశలో స్పాట్ ఫిక్సింగ్ కలకలం అంకిత్ క్రికెట్ కెరీర్ను పూర్తిగా నాశనం చేసింది...