భారత క్రికెట్లో ఆ విషయంపై లుకలుకలు... బీసీసీఐ చీఫ్ ఆఫీసర్ రాజీనామా...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం, బోర్డు ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ వర్సెస్ విరాట్ కోహ్లీగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది...

వన్డే కెప్టెన్గా మంచి రికార్డు ఉన్న విరాట్ని అర్ధాంతరంగా ఆ పొజిషన్ నుంచి తప్పించాడని తప్పుబడుతూ అతనికి మద్ధతుగా నిలుస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా, ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీలను ఆ పొజిషన్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...
టీమిండియా బాగు కోసం సౌరవ్ గంగూలీ ఆ నిర్ణయం తీసుకున్నాడని, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు పర్ఫామెన్స్ చూసిన తర్వాత కూడా విరాట్ కోహ్లీని కెప్టెన్గా కొనసాగించడం మూర్ఖత్వమే అవుతుందని దాదా ఫ్యాన్స్, బీసీసీఐ ప్రెసిడెంట్కి సపోర్ట్ చేస్తున్నారు...
కోహ్లీ విషయాన్ని బోర్డు చూసుకుంటుందని సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్లతో మరింత అలర్ట్ అయిన విరాట్ ఫ్యాన్స్... ‘World Stands with Kohli’ అంటూ తమ మద్ధతును చాటుతున్నారు...
ఈ సంఘటనల మధ్య బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిజిత్ సల్వా, అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది...
అండర్-16, 19 టోర్నీల నుంచి టీమిండియాకి ఎంపికయ్యే ప్లేయర్ల దాకా, ఆటగాళ్ల వయసును నిర్ధారణ చేసే ఆఫీసర్గా ఉన్నాడు అభిజిత్ సల్వా...
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు ముగిసిన తర్వాత అభిజిత్ సల్వా, తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు...
జనవరి 9 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అండర్16 క్రికెటర్లతో నిర్వహించాల్సిన విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ముందు అభిజిత్ రాజీనామా చేయడం అనుమానాలకు తావిస్తోంది...
విజయ్ మర్చెంట్ ట్రోఫీలో పాల్గొనే 36 జట్ల ప్లేయర్ల వయసును నిర్ధారణ చేయాల్సిన బాధ్యత అభిజిత్పైనే ఉంది. అభిజిత్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశాడని సమాచారం...
అయితే ఓ రాజకీయ నాయకుడి మరణం తర్వాత ఎవరు ఎలా చనిపోయినా, అది ఆ పొలిటీషన్ చావు వార్త తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి లిస్టులోకి చేరినట్టు... ఇప్పుడు బీసీసీఐలో ఏం జరిగినా అది విరాట్ వన్డే కెప్టెన్సీతో ముడిపెట్టి చూస్తున్నారు ఫ్యాన్స్..
బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం గురించి తీవ్రమైన చర్చ నడుస్తున్న సమయంలో బీసీసీఐలో ఉన్నత పొజిషన్లో ఉన్న అధికారి రాజీనామా చేయడంతో ఇది కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది..