రమేశ్ పవార్కు షాకిచ్చిన బీసీసీఐ.. ఉమెన్స్ టీమ్ హెడ్ కోచ్గా తొలగింపు..! కనిత్కర్కు కీలక బాధ్యతలు..
BCCI: భారత మాజీ క్రికెటర్, సీనియర్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రమేశ్ పవార్ కు బీసీసీఐ షాకిచ్చింది. అతడిని ఆ బాధ్యతల నుంచి తప్పంచి (!) మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది.
ఇటీవలే బీసీసీఐ నియమించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆదిలోనే పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. సీఏసీ సూచన మేరకు భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న రమేశ్ పవార్ కు బీసీసీఐ షాకిచ్చింది. అతడిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బ్యాటింగ్ కోచ్ గా సేవలందిస్తున్న మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ ను భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. కనిత్కర్.. త్వరలో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే టీ20 సిరీస్ నుంచే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది.
ఉమెన్స్ టీమ్ హెడ్ కోచ్ నుంచి తొలగించిన రమేశ్ పవార్ కు ఎన్సీఏ లో స్పిన్ బౌలింగ్ కోచ్ గా అవకాశం కల్పించింది బీసీసీఐ. అతడు ఇకనుంచి ఎన్సీఏలో యువ క్రికెటర్లకు స్పిన్ బౌలింగ్ పాఠాలు చెప్పనున్నాడు. పవార్ ను తొలగించడం (!)తో ఉమెన్స్ టీమ్ కు కొత్త కోచ్ ఎవరన్నది బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.
తన నియామకంపై కనిత్కర్ మాట్లాడుతూ.. ‘భారత మహిళా క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఎంపికవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మన ఉమెన్స్ టీమ్ యువ, సీనియర్ ఆటగాళ్లతో సమిష్టిగా రాణిస్తున్నది. వాళ్లు సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో మాకు కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ కోచ్ గా నేను కూడా ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నా..’ అని అన్నాడు.
ఇక పవార్ తనను ఎన్సీఏ స్పిన్ బౌలింగ్ కోచ్ గా నియమించడంపై స్పందిస్తూ.. ‘సీనియర్ ఉమెన్స్ టీమ్ కు నేను చాలాకాలంగా హెడ్ కోచ్ గా సేవలందించాను. నాకు క్రికెటర్ గా ఉన్న అనుభవంతో పాటు హెడ్ కోచ్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ తో కుర్రాళ్లను మెరుగ్గా తీర్చిదిద్దుతానన్న నమ్మకం నాకుంది.. వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలో మేమందరం యువ ఆటగాళ్లను సానబెడతాం..’ అని తెలిపాడు.
ఇదిలాఉండగా బీసీసీఐ నియమించిన సీఏసీ.. త్వరలోనే భారత పురుషుల జట్టుకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టీ20కి కొత్త కెప్టెన్, కొత్త హెడ్ కోచ్ లను నియమించే విధంగా.. భారత క్రికెట్ లో కూడా స్ప్లిట్ కెప్టెన్సీ, స్ప్లిట్ కోచింగ్ విధానాన్ని అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నది. బహుశా ఐపీఎల్ మినీ వేలం తర్వాత భారత క్రికెట్ లో గుణాత్మక మార్పులు చూడొచ్చని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.