టెస్టు మ్యాచ్ మధ్యలో మహ్మదుల్లా షాకింగ్ నిర్ణయం... ఇక ఆడలేనంటూ టెస్టులకు రిటైర్మెంట్...
పురుషులందు, పుణ్యపురుషులు వేరయా... అన్నట్టుగా క్రికెటర్లందు, బంగ్లాదేశ్ క్రికెటర్లు వేరయా... అనాల్సిందే. మ్యాచ్ పూర్తికాకముందే సంబరాలు చేసుకోవాలన్నా, అంపైర్లపై వీరావేశంతో రెచ్చిపోవాలన్నా బంగ్లా క్రికెటర్లకే సాధ్యం... తాజాగా బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా అలాంటి నిర్ణయంతోనే బోర్డుకి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ ఆడుతోంది బంగ్లాదేశ్ జట్టు. తొలి ఇన్నింగ్స్లో ఆల్రౌండర్ మహ్మదుల్లా 278 బంతుల్లో 17 ఫోర్లు, ఓ సిక్సర్తో 150 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
ఆ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు మహ్మదుల్లా... ఈ హఠాత్ నిర్ణయంతో బంగ్లా జట్టుతో పాటు క్రికెట్ బోర్డు కూడా ఆశ్చర్యానికి గురైంది..
‘అవును, మహ్మదుల్లా టెస్టుల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఫోన్ ద్వారా తెలిపాడు. అయితే అతను ఇంకా అధికారికంగా రిటైర్మెంట్ ఇవ్వలేదు... అతను తీసుకున్న నిర్ణయం ఎమోషనల్గా వచ్చిందని అనుకుంటున్నాం...
అయితే సిరీస్ నడుస్తున్న సమయంలో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. అయితే ఏ ప్లేయర్ని బలవంతంగా ఆడించలేం. ఎవరి ఇష్టం వారిది... అతను రాతపూర్వకంగా రిటైర్మెంట్ ఇచ్చాకే, దీని గురించి ప్రకటిస్తాం’ అంటూ తెలిపింది బంగ్లా క్రికెట్ బోర్డు...
2009లో ఆరంగ్రేటం చేసిన మహ్మదుల్లా, ఇప్పటిదాకా 49 టెస్టుల్లో 2764 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీ20 జట్టుకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న మహ్మదుల్లా, ఢాకా ప్రీమియర్ లీగ్లో అంపైర్తో అనుచితంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు...
‘ఇలా సడెన్గా టెస్టు మధ్యలో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే, అది మిగిలిన జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇలాంటివాటిని బోర్డు అంగీకరించదు...
అతను ఆడకూడదని అనుకుంటే, అందులో ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. అయితే తప్పుకోవడానికి ఓ సమయం, సందర్భం ఉంటుంది. టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత లేదా ఆఖరి రోజున తన నిర్ణయం ప్రకటించి ఉంటే బాగుండేది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీబీ ప్రెసిడెంట్.