Sri Lanka Crisis: ఆసీస్ ఆటగాళ్ల ఉదారత.. లంకలో చిన్నారులకు సాయం
Sri Lanka Crisis: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజలు దినదినగండంగా బతుకుతున్నారు. నిత్యావసరాల పెరుగుదల అక్కడ ప్రజలను కుంగదీస్తున్నది.

తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ప్రజల స్థితిగతులను చూసి ఆస్ట్రేలియా క్రికెటర్లు చలించారు. వారి ఆకలిని తీర్చడానికి ముందుకొచ్చారు. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు కూడా ఆడిన విషయం తెలిసిందే.
అయితే లంకలో పరిస్థితులను దగ్గర్నుంచి గమనించిన ఆసీస్ ఆటగాళ్లు తమ ఉదారతను చాటుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా వాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీని లంక చిన్నారులకు అందించనున్నారు.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు.
ఆసీస్ లో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి.
ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం..’ అని అన్నాడు.
కమిన్స్ ఇలా సాయం చేయడం ఇదేం ప్రథమం కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.
లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది.