భారత్లో భారత్ను ఓడించేందుకు కంగారూల వ్యూహ రచన.. భారీ ప్లాన్ వేసినట్టున్నారే...!
INDvsAUS Test Series: మెగా టోర్నీలలో విఫలమవుతున్నా విదేశాలలో ద్వైపాక్షిక సిరీస్ లలో దుమ్మురేపుతున్న టీమిండియాను సొంతగడ్డపై ఓడించటం అంత తేలికకాదు. అదీ టెస్టులలో అయితే మరీ కష్టం.
త్వరలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా.. భారత్ ను భారత్ లో ఓడించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. 2004 తర్వాత భారత్ ను సొంతగడ్డపై ఓడించేందుకు నానా తంటాలు పడుతూ విఫలమవుతున్న కంగారూలు.. ఈసారి మాత్రం భారత్ ను ఓడించేందుకే ఇక్కడికి వస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చిలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు గాను ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ జట్టు భారత్ కు రానుంది. ఇక్కడ భారత్ తో నాలుగు టెస్టులు, మూడు వన్డేలను ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే 18 మందితో కూడిన జట్టును కూడా ప్రకటించింది.
జట్టును ప్రకటించిన ఆసీస్.. ఇప్పుడు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇదే అంశాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘ది టెస్ట్’ సీజన్ -2లో వెల్లడించింది. దీనిలో భారత పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహాలు, గత వైఫల్యాలకు సంబంధించిన సమీక్షలు ఉన్నట్టు తెలుస్తున్నది. నేటి నుంచి ఈ షార్ట్ ఫిల్మ్ అమెజాన్ లో ప్రసారం కానుంది.
గురువారం సిడ్నీ వేదికగా జరిగిన ది టెస్ట్ సీజన్ - 2 వరల్డ్ ప్రీమియర్ స్క్రీనింగ్ లో ఆసీస్ సారథి కమిన్స్ తో పాటు ఉస్టాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, ట్రావిస్ హెడ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ.. ‘నాటి టెస్టు (2004 టెస్ట్ టీమ్) ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆ పరిస్థితులకు త్వరగా అలవాటుపడేది. వాళ్లు అద్భుతమైన ప్రమాణాలు సెట్ చేశారు. వాళ్లు ఇండియాలో గెలిచారు. ఇంగ్లాండ్ లోనూ విజయం సాధించారు. ఆసీస్ లో కొత్త బాల్ తో ఇన్నర్ సర్కిల్ ఫీల్డింగ్ తో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఉపఖండంలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అక్కడ కొత్త బంతితో చేయడానికి ఏమీ ఉండదు..’అని అన్నాడు.
ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. ‘2016లో ఆసీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగాం. కానీ మా ప్రణాళిక విఫలమై ఓడిపోయాం. ఈ సిరీస్ లో మూడు టెస్టులలో మూడు ప్రణాళికలు చేశాం’అని తెలిపాడు.