భారత జట్టు లో మూడు ప్రధాన మార్పులు? బీసీసీఐ ఏం ప్లాన్ చేస్తోంది?
Asia Cup 2025 India: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నమెంట్ UAEలోని దుబాయ్, అబుదాబి వేదికలుగా జరగనుంది. ప్రస్తుత ఛాంపియన్ అయిన భారత జట్టు ఈ టోర్నీ కోసం జట్టులో పలు కీలక మార్పులు చేస్తోంది.

ఆసియా కప్ 2025
క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. భారత జట్టు మరోసారి ఆసియా కప్ ట్రోఫీని నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. దీని కోసం జట్టులో పలు కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ప్రధానంగా మూడు మార్పులు తప్పకుండా ఉంటాయని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
KNOW
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు?
ఆసియా కప్ లో టీమిండియా అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. 2025 ఎడిషన్ ఆసియా కప్ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించనున్నారు. ముంబైలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశమై ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటిస్తుంది.
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్కు మూడు కీలక నిర్ణయాలు తీసుకోనుందని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
శుభ్మన్ గిల్కు చోటు లేదు
ఈ నివేదిక ప్రకారం, సంజు శాంసన్, అభిషేక్ శర్మలను ఆసియా కప్ టోర్నమెంట్లో భారత జట్టు ఓపెనర్లుగా ఎంపిక చేయాలని బీసీసీఐ ఎంపిక కమిటీ నిర్ణయించింది. అలాగే, ఇంగ్లాండ్ దుమ్మురేపే బ్యాటింగ్ తో పరుగుల వరద పారించిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ ను కూడా భారత టీ20 జట్టులోకి తీసుకోవాలనే అంశం తెరమీదకు వచ్చింది.
భారత టీ20 జట్టులోకి జైస్వాల్
3వ నెంబర్ ఆటగాడిగా ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయాలని ఎంపిక కమిటీ నిర్ణయించింది. అందువల్ల శుభ్మన్ గిల్ను తప్పించాలని ఎంపిక కమిటీ భావిస్తోంది. గతంలో గిల్ను ఆసియా కప్ టోర్నమెంట్కు ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్ గా చేయాలనే చర్చలు జరిగాయి.
మహ్మద్ సిరాజ్ కు విశ్రాంతి
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్లో 23 వికెట్లు తీసి సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన సిరాజ్కు కూడా చోటుకల్పించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. అయితే, తాజా రిపోర్టుల ప్రకారం.. ఆసియా కప్ టోర్నమెంట్ నుండి సిరాజ్ కు విశ్రాంతి ఇవ్వాలని ఎంపిక కమిటీ నిర్ణయించింది.
రెడీగా బుమ్రా
ఆసియా కప్ టోర్నమెంట్కు జస్ప్రీత్ బుమ్రా ఎంపిక దాదాపు ఖరారైంది. అందువల్ల హైదరాబాద్కు చెందిన పేసర్ సిరాజ్కు విశ్రాంతి ఇవ్వనున్నారు. శ్రేయాస్ అయ్యర్ జట్టులో చోటు దక్కదని సమాచారం. ఐపీఎల్ లో కెప్టెన్ గా అదరగొట్టిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అంచనాలు పెంచిన శ్రేయాస్ అయ్యర్కు మరోసారి నిరాశ ఎదురైంది.
ఫిట్ గా సూర్య కుమార్ యాదవ్.. భారత జట్టులో రింకూ సింగ్
గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ రాబోయే టోర్నమెంట్ కోసం ఫిట్ గా ఉన్నాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. ముంబైకి చెందిన అయ్యర్కు టీ20 జట్టులో చోటు దక్కించుకోవడానికి ఇంకా సమయం పట్టవచ్చు.