ఎంపికైన ప్రతీ ప్లేయర్కి అవకాశం ఇస్తాం... శ్రీలంక టూర్ టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్...
వచ్చే నెల శ్రీలంకలో పర్యటించే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. శిఖర్ ధావన్ను కెప్టెన్గా, భువనేశ్వర్ కుమార్ను వైస్ కెప్టెన్గా ప్రకటించిన సెలక్టర్లు, కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించారు. ఈ టూర్కి భారత జట్టు కోచ్గా వ్యవహరించబోతున్న భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు...
భారత అండర్ 19 జట్టుకి కోచ్గా వ్యవహారించిన రాహుల్ ద్రావిడ్, ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్గా ఉన్నారు. భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టుతో ఇంగ్లాండ్లో ఉండడంతో రాహుల్ ద్రావిడ్, లంక టూర్కి కోచ్గా వ్యవహారించనున్నారు.
‘టీమిండియా ఏ జట్టు కోచ్గా ఉన్న సమయంలో ఆటగాళ్లకి ఒకే విషయం చెప్పేవాడిని. నాతో వచ్చేవాళ్లందరికీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడే అవకాశం దొరుకుతుంది. జట్టుకి ఎంపికైన తర్వాత మ్యాచ్లు ఆడకుండా తిరిగి వచ్చే అవకాశమే ఉండదు...
నా చిన్నప్పుడు ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. ఓ సిరీస్కి ఎంపికైన తర్వాత ఆడే అవకాశం రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం... కాబట్టి అలాంటి పరిస్థితి ఏ ప్లేయర్కి రాకూడదని నా తాపత్రయం...’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్...
‘నువ్వు మంచిగా ఆడి, 700-800 పరుగులు చేస్తే, నీకు జట్టులో చోటు ఎక్కడికి పోదు. నువ్వు ఏం చేయగలవో ప్రపంచానికి చూపించే అద్భుత అవకాశం ఇది. సెలక్టర్లు నిన్ను కచ్ఛితంగా దృష్టిలో పెట్టుకుంటారు...
అయితే ఒక్క సీజన్లో చేసిన పరుగుల వద్ద జట్టులో చోటు దక్కదు. మళ్లీ వచ్చే సీజన్లో అలాంటి ప్రదర్శనే కావాలి. రెండు సీజన్లలో చేసినా అవకాశం వస్తుందని చెప్పలేం... వేచి చూడాలి. అంటే ప్రతీ గేమ్ను ఫైనల్లా ఆడాలి... ప్రతీ మ్యాచ్ను నీకొచ్చిన అవకాశంగా భావించాలి. అప్పుడే సెలక్టర్ల దృష్టిలో పడతారు...
ఓ టూర్కి 15 లేదా 20 మంది ప్లేయర్లు మాత్రమే సెలక్ట్ అవుతారు. 15 మందిలో నలుగురు తప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం 11 మంది మాత్రమే మ్యాచ్ ఆడతారు. ఆ 11 మందిలో నువ్వు ఎందుకు ఉండాలో నీ పర్ఫామెన్స్ ద్వారా చూపించాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్.
అండర్19 వరల్డ్కప్లో ప్రతీ మ్యాచ్కి ముందు ఐదారు మార్పులు చేసేవారమని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చాడు ద్రావిడ్.
‘బీచ్లో ఆడడం, రోడ్డు మీద ఆడడం వల్ల క్రికెటర్లుగా మారిపోరు. ఆటను ప్రేమించాలి. మేం అదే చేశాం. టీమిండియాలో చోటు దక్కించుకున్నవారిలో చాలామంది ఆటను ప్రేమించారు, గౌరవించారు...
ఇప్పుడు క్రికెటర్ల కోసం మ్యాటింగ్ వికెట్లు ఉన్నాయి, కోచ్లు ఉన్నారు, ఫిట్నెస్ అసిస్టెంట్లు ఉన్నారు. మా సమయంలో ఇవన్నీ ఎక్కడివి. మేం కేవలం ఆడాలనే తపన, తాపత్రయంతో వచ్చాం, ఇక్కడే ఎన్నో విషయాలు నేర్చుకున్నాం....
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్ల ఫిట్నెస్ చూసి మేం ఆశ్చర్యపోయేవాళ్లం. వీళ్లేం తింటారబ్బా ఇలా ఉన్నారని అనుకునేవాళ్లం. వారికి ఫిట్నెస్ ట్రైయినర్లు ఉండేవారు. మాకు అవేమీ ఉండేవి కావు....
జిమ్లో ఎక్కువ వ్యాయామాలు చేయకండి. అలా చేస్తే మీ శరీరం స్టిఫ్గా తయారవుతుంది. కేవలం బౌలింగ్ చేయండి, పరుగెత్తండి.... అని చెప్పేవాళ్లు...’ అంట పాత విషయాలను గుర్తుచేసుకున్నాడు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్.
ఓపెనర్లుగా నలుగురిని ఎంపిక చేసింది బీసీసీఐ. శిఖర్ ధావన్, పృథ్వీషా ఓపెనర్లు వస్తే... యంగ్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, దేవ్దత్ పడిక్కల్ కోసం మళ్లీ ఓపెనింగ్ జోడిని మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ వారిని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే అక్కడ చోటు కోసం ఎదురుచూస్తున్న మనీశ్ పాండే, నితీశ్ రాణా, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ప్లేయర్లను లోయర్ ఆర్డర్కి దించాలి.
ఓ రకంగా చెప్పాలంటే యంగ్ ప్లేయర్లకు అవకాశం కల్పించినా ఈ జట్టులో నుంచి బెస్ట్ ఎలెవన్ను ఎంపిక చేయడం చాలా పెద్ద పని. అదీకాక మిడిల్ ఆర్డర్లో ఉండే కీ ప్లేయర్లు అందరూ ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్నారు. కాబట్టి ఐపీఎల్లో ఓపెనింగ్ చేసే ప్లేయర్లతోనే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించాల్సి ఉంటుంది.