ఐదో టెస్టుకి ముందు టీమిండియాకి షాక్... మరో భారత సభ్యుడికి పాజిటివ్...
ఇంగ్లాండ్ టూర్లో కరోనా వైరస్ అలజడి, టీమిండియాను కలవరపెడుతూనే ఉంది. నాలుగో టెస్టు సమయంలో భారత హెడ్కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడగా... తాజాగా భారత బృందంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది...
ఐదో రోజు ఆరంభానికి ముందు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గురువారం భారత జట్టు ట్రైయినింగ్ సెషన్ను రద్దు చేశారు అధికారులు...
భారత ఆటగాళ్లు అందరూ ముందుజాగ్రత్తగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. భారత బృందంలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో ఐదో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి...
శుక్రవారం ఉదయం మరో విడతగా భారత జట్టు ప్లేయర్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రిజల్ట్ వస్తేనే, మ్యాచ్ ప్రారంభమవుతుంది...
లేదంటే ఐదో టెస్టును వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. ఇప్పటికే టీమిండియా టెస్టు సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది...
దీంతో ఐదో టెస్టు రద్దు అయితే భారత జట్టుకి టెస్టు సిరీస్ సొంతమవుతుంది. కాబట్టి ఇంగ్లాండ్ బోర్డు, ఆఖరి టెస్టును ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చు...
నాలుగో టెస్టు మూడో రోజు సాయంత్రం లండన్లో ఓ ఫైవ్ స్టార్ హోటెల్లో ఏర్పాటు చేసిన పార్టీకి కోచ్ రవిశాస్త్రితో పాటు టీమిండియా సభ్యులందరూ హాజరయ్యారు...
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి, బీసీసీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయో బబుల్ నుంచి బయటికి వెళ్లిన ఈ కార్యక్రమం వల్లే టీమిండియాకి వైరస్ సోకి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు...
ఇలా చెప్పాపెట్టకుండా బయటికి ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలను ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ...