బుద్ధిగా ఉండండి... కరోనా సోకినా ఇష్టారాజ్యంగా పాక్ క్రికెటర్లు... మరో క్రికెటర్కి కరోనా పాజిటివ్!
న్యూజిలాండ్తో టీ20, టెస్టు సిరీస్ కోసం కివీస్ గడ్డ మీద పాక్ క్రికెట్ జట్టుకి షాక్ తగిలింది. న్యూజిలాండ్లో అడుగుపెట్టిన 25 మంది క్రికెటర్లలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా సోకిన ఆరుగురిలో ఇద్దరు ఎప్పటినుంచో కరోనాతో బాధపడుతున్నట్టు రిపోర్టులో రావడంతో అందరూ షాక్కి గురయ్యారు. కరోనా సోకిన క్రికెటర్లను ఐసోలేషన్కి తరలించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, మిగిలిన క్రికెటర్లను క్వారంటైన్లో ఉంచింది.
కరోనా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ సిరీస్ ఆడాలనే క్రికెటర్లు 14 రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతున్న టీమిండియా 14 రోజుల పాటు క్వారంటైన్ పీరియడ్ పూర్తిచేసుకుంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ పూర్తి చేసుకున్న పాక్ క్రికెటర్లు, కివీస్తో మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ చేరుకున్నారు. వీరికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆరుగురికి కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది.
కరోనా సోకిన సభ్యులను ఐసోలేషన్కి తరలించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, మిగిలిన క్రికెటర్లకు వేర్వేరుగా క్వారంటైన్ ఏర్పాటు చేసింది. అయితే చాలామంది పాక్ క్రికెటర్లు ప్రోటోకాల్ను అతిక్రమించారు.
గదిలో ఒంటరిగా గడపాలని చెప్పినా సరే నిబంధనలను అతిక్రమించి పాక్ క్రికెటర్లు సెల్ఫీలు తీసుకోవడం, కలిసి కూర్చొని చర్చించుకోవడం, క్రైస్ట్చర్చి హోటెల్ సిబ్బందితో తదితరులతో అసభ్యంగా ప్రవర్తించడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
ఎన్నిసార్లు ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని పాక్ క్రికెటర్లకు చెప్పినా వినిపంచుకోకపోవడంతో మరోసారి ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే సిరీస్ను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.
ఈ హెచ్చరికలపై స్పందించాడు పాక్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్. ‘నేను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకి ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది ఓ క్లబ్ టీమ్ కాదు, పాకిస్థాన్ జాతీయ జట్టు. ఇలా టూర్ రద్దు చేసి వెనక్కి పంపించేస్తామని ఎలా చెబుతారు? మీకు మీరు అవసరం లేదు, మా క్రికెట్ అంతమైపోలేదు, మేం మీ డబ్బు కోసం ఆశగా ఎదురుచూడడం లేదు’ అంటూ తీవ్రంగా స్పందించాడు షోయబ్ అక్తర్.
‘న్యూజిలాండ్, పాక్ సిరీస్ ద్వారా వచ్చే బ్రాడ్కాస్టింగ్ డబ్బులు మీకే వస్తాయి. మాకు కాదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సిరీస్ ఆడేందుకు వచ్చిన సాహసం చేసిన మాకు మీరు రుణపడి ఉండాలి...’ అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్.
అయితే క్వారంటైన్లో ఉన్న మరో పాక్ క్రికెటర్కి కరోనా సోకిందని తెలిపింది న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సామాజిక దూరం పాటించాలని చెప్పినా పాక్ క్రికెటర్లు పట్టించుకోకపోవడం వల్లే మరో క్రికెటర్కి కరోనా సోకినట్టు చెప్పింది కివీస్.
న్యూజిలాండ్లో అడుగుపెట్టిన క్రికెట్ జట్టులో కరోనా సోకిన పాక్ క్రికెటర్ల సంఖ్య ఏడుకి చేరింది. దీంతో డిసెంబర్ 18 నుంచి జరిగే న్యూజిలాండ్, పాకిస్థాన్ సిరీస్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షోయబ్ అక్తర్ వ్యాఖ్యలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంటే పాక్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టబోతోంది. ఇప్పుడిప్పుడే పాక్తో క్రికెట్ ఆడేందుకు సాహసిస్తున్న దేశాలు కూడా మళ్లీ వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది.