అబ్బే అలాంటిదేం లేదే.. అంతా ఓకే..! జడ్డూతో విభేదాలపై స్పందించిన సీఎస్కే యాజమాన్యం
Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వ్యవహారం ముదిరి పాకానపడటంతో చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది. అతడు తమతోనే ఉంటాడని ఫ్యాన్స్ ను శాంతింజేసే ప్రయత్నం చేసింది.

ఐపీఎల్ లో దశాబ్దకాలంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా త్వరలోనే ఆ జట్టును వీడనున్నాడని.. జడేజా-సీఎస్కే మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అతడు చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది.
శనివారం జడ్డూ.. 2021, 2022 లో తాను చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతుండగా తీసిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేశాడు. దీంతో సీఎస్కేను జడ్డూ వీడటం ఖాయమని చెన్నైతో పాటు జడేజా అభిమానులలో కూడా అనుమానాలు తలెత్తాయి.
అదీగాక జడేజా.. ఇటీవలే బర్త్ డే చేసుకున్న ధోనికి పుట్టినరోజు విషెస్ చెప్పకపోవడంతో ఈ సందేహాలు నిజమయ్యాయి. ధోని-జడేజాతో పాటు జడేజా-సీఎస్కే సంబంధాలు కూడా బాగోలేవని నెటిజన్లు శనివారమంతా సామాజిక మాధ్యమాలలో చెవులు కొరుక్కున్నారు.
ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం స్పందించింది. జడేజా తో తమకు ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని తేల్చి చెప్పింది. వచ్చే సీజన్ లో కూడా జడ్డూ తమతోనే ఉంటాడని ఫ్యాన్స్ ను శాంతింపజేసే ప్రయత్నం చేసింది.
ఇదే విషయమై సీఎస్కేకు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘చూడండి.. ఇన్స్టాలో పోస్టులు డిలీట్ చేసుకోవడమనేది అతడి వ్యక్తిగత వ్యవహారం. మాకు వాటితో సంబంధం లేదు. జడేజాతో మాకు ఎలాంటి విభేదాలు లేవు. అంతా బాగే ఉంది. నథింగ్ ఈజ్ రాంగ్..’ అని తెలిపాడు.
ఈ విషయంపై జడేజా ప్రత్యక్షంగా స్పందించకపోయినా ఇటీవలే ముగిసిన ఎడ్జబాస్టన్ టెస్టులో రెండో రోజు సెంచరీ చేసిన అనంతరం విలేకరుల సమావేశం సందర్భంగా ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘నేను దాని గురించి పట్టించుకోవట్లేదు. అది గడిచిపోయింది. నా దృష్టంతా టీమిండియాకు బాగా ఆడటం పైనే ఉంది..’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.