ఆ రనౌట్ తర్వాత కోహ్లీతో మాట్లాడా... విరాట్ నాతో అలా అన్నాడు... అజింకా రహానే కామెంట్...
ఆడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్టులో మొదటి రెండు రోజుల్లో మంచి ఆధిపత్యం చూపించింది టీమిండియా. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 180 బంతుల్లో 8 ఫోర్లతో 74 పరుగులు చేసి, మంచి టచ్లో కనిపించాడు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించిన టీమిండియా, కోహ్లీ రనౌట్ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన విరాట్ కోహ్లీ... బౌలర్లకి అనుకూలిస్తున్న ఆడిలైడ్ పిచ్పై ఓపిగ్గా ఆడాడు..
అవసరమైన బంతులను బౌండరీకి తరలిస్తూ సెంచరీ వైపు సాగుతున్న విరాట్ కోహ్లీ, అజింకా రహానే రాంగ్ కాల్ కారణంగా రనౌట్ అయ్యాడు...
కోహ్లీ రనౌట్ టీమిండియా స్కోరుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. 188 పరుగుల వద్ద విరాట్ వికెట్ కోల్పోయిన టీమిండియా, 244 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
విరాట్ కోహ్లీ రనౌట్ తర్వాత 57 పరుగులకే చివరి 7 వికెట్లు కోల్పోవడం ఆస్ట్రేలియాకి ప్లస్ పాయింట్ అయ్యిందని ఆసీస్ కోచ్ లాంగర్ కూడా వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీ రనౌట్ తర్వాత అజింకా రహానేపై తీవ్రంగా ట్రోల్స్ వినిపించాయి. కోపంగా పెవిలియన్ చేరిన విరాట్, స్టాండ్స్లోనూ అసహనాన్ని ప్రదర్శించాడు...
అయితే ఆ రోజు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీతో మాట్లాడాడట అజింకా రహానే... రాంగ్ కాల్ ఇచ్చినందుకు సారీ కూడా చెప్పాడట.
‘మొదటి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ రనౌట్ నిజంగా నా తప్పిదమే. కోహ్లీ రనౌట్ టీమిండియాపై చాలాపెద్ద ఎఫెక్ట్ చూపించింది...
నేను, విరాట్ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాలని భావించాం. అంతా సరిగా వెళుతుందని అనుకుంటున్న సమయంలో రనౌట్ కారణంగా మంచి భాగస్వామ్యాన్ని కోల్పోయాం...
ఆ రోజు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను... దానికి నవ్వేసిన కోహ్లీ, మ్యాచ్ల్లో ఇవన్నీ సహజమని అన్నాడు...
రనౌట్ జరిగిన పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం. అందుకే దాన్ని గౌరవించాం...’ అని చెప్పుకొచ్చాడు అజింకా రహానే..
మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టుకి కెప్టెన్గా వ్యవహారిస్తున్న అజింకా రహానే... తొలి ఇన్నింగ్స్లో జట్టును సమర్థవంతంగా నడిపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.