మరో మైలురాయి ఎదుట కోహ్లీ.. సెంచరీ సంగతి దేవుడెరుగు కానీ ఇదైనా సాధిస్తాడా..?
INDvsAUS 3rd Test: పరిమిత ఓవర్ల క్రికెట్ తిరిగి పాత ఆటను అందుకున్న కోహ్లీ.. టెస్టు క్రికెట్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. టెస్టులలో కోహ్లీ సెంచరీ చేయక సుమారు మూడేండ్లు దాటిపోయింది.

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పేరిట ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులున్నాయి. మూడు ఫార్మాట్లలోనూ ఒకప్పుడు పరుగుల వరద పారించిన కోహ్లీ.. 2019 తర్వాత ఫామ్ కోల్పోయి గత ఆగస్టు నుంచే తిరిగి మునపటి ఫామ్ ను అందుకున్నాడు.
అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ తిరిగి పాత ఆటను అందుకున్న కోహ్లీ.. టెస్టు క్రికెట్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. టెస్టులలో కోహ్లీ సెంచరీ చేయక సుమారు మూడేండ్లు దాటిపోయింది. గతేడాది శ్రీలంక సిరీస్ తో పాటు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ టూర్ లలో విఫలమైన కోహ్లీ.. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.
సెంచరీ సంగతి దేవుడెరుగు గానీ మూడో టెస్టు ముందు కోహ్లీ ఎదుట ఓ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం వచ్చింది. మరో 77 పరుగులు చేస్తే కోహ్లీ.. టెస్టులలో స్వదేశంలో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత క్రికెటర్ గా నిలుస్తాడు.
కోహ్లీ ఇప్పటివరకు స్వదేశంలో 48 టెస్టులు ఆడి 3,923 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ సగటు 59.44గా ఉండటం గమనార్హం. 48 టెస్టులలో 13 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. మరి ఇండోర్ లో 77 పరుగులు చేసి 4 వేల పరుగుల రికార్డును అందుకుంటాడో లేదో చూడాలి.
కోహ్లీ కంటే ముందు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (7,216), రాహుల్ ద్రావిడ్ (5,598), సునీల్ గవాస్కర్ (5,067), వీరేంద్ర సెహ్వాగ్ (4,656) లు ముందున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 25 వేల పరుగులు చేసుకున్న కోహ్లీ.. ఇండోర్ లో 77 పరుగులతో పాటు సెంచరీ చేయాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్ లలో 12, 44, 20 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఢిల్లీ టెస్టులో తన స్వంతగడ్డపై కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. టెస్టులలో దారుణంగా విఫలమువుతున్న కోహ్లీ మూడో టెస్టులో అయినా స్థాయికి తగ్గట్టు ఆడతాడో లేదో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. రేపటి నుంచే ఇండోర్ లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరగాల్సి ఉంది.