- Home
- Sports
- Cricket
- అగ్రెషన్ ఒక్కటే సరిపోదు.. ఆట కూడా కావాలి.. పరోక్షంగా కోహ్లీని టార్గెట్ చేసిన గంగూలీ..!
అగ్రెషన్ ఒక్కటే సరిపోదు.. ఆట కూడా కావాలి.. పరోక్షంగా కోహ్లీని టార్గెట్ చేసిన గంగూలీ..!
టీమిండియా గత పదేండ్లుగా ఐసీసీ టోర్నీలలో విఫలమవడం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లకూ అసహనం తెప్పిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్ లు, ఉపఖండంలో జరిగే మ్యాచ్ లలో రికార్డు విజయాలతో దూసుకుపోయే భారత ఆటగాళ్లు కీలక మ్యాచ్లలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు.

మరీ ముఖ్యంగా ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రం భారత ప్రదర్శన దారుణంగా ఉంటోంది. ఇటీవలే కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కూడా భారత్.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. ఇది ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది.
భారత జట్టు ఐసీసీ టోర్నీలలో ఓడటంపై తాజాగా టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. భారత జట్టుకు అగ్రెషన్ ఒక్కటే ఉంటే సరిపోదని.. ఆట కూడా ఉండాలని కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్ వెనుక అతడు టీమిండియాతో పాటు విరాట్ కోహ్లీని కూడా విమర్శించినట్టు అతడి ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు.
దాదా మాట్లాడుతూ.. ‘అగ్రెషన్ ఉండటం, ఆ దృక్పథంతో ఆడటం మంచిదే. కానీ అదొక్కటే ఉంటే సరిపోదు. ఆట కూడా ఉండాలి. నేను కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా 2001 - 2006 మధ్య కాలంలో నిలకడగా రాణించింది. పెద్ద వేదికలపై టెస్టులలో మేం 500 - 600 పరుగులు చేసేవాళ్లం.
సిడ్నీ, బ్రిస్బేన్, నాటింగ్హోమ్, ఓవల్, పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్.. ఇలా ఎక్కడికెళ్లినా మేం భారీ స్కోర్లు చేసేవాళ్లం. ఇది ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేది. ప్రస్తుత జట్టు కూడా ఇదే విధానాన్ని ఫాలో అయితే బెటర్. గడిచిన పదేండ్లలో క్రికెట్ లో చాలా మార్పులొచ్చాయన్నది వాస్తవం. ఆటలో కొత్త నిబంధనలు, పరిస్థితులు, వికెట్స్, పిచెస్.. ఇలా ప్రతీదాంట్లో మార్పులొచ్చాయి.
అయితే టెస్టులో తొలి ఇన్నింగ్స్ స్కోరు చాలా కీలకం. ప్రత్యర్థుల ఎదుట కనీసం 350-400 అయినా చేస్తే ప్రత్యర్థిపై సైకలాజికల్ గా విజయం సాధించొచ్చు. కానీ కొద్దికాలంగా టీమిండియా ఇలా చేయడంలో విఫలమవుతోంది..’అని చెప్పాడు.
కాగా టీమిండియాలో అగ్రెషన్ అంటే గుర్తుకొచ్చేది విరాట్ కోహ్లీ. విరాట్ సారథ్యంలో టీమిండియా స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా అత్యద్భుత విజయాలు సాధించింది. అయితే అతడు సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకున్నాక రోహిత్ సారథ్యంలో భారత జట్టు అంత దూకుడుగా ఆడటం లేదు. టీమ్ మొత్తంలో అగ్రెషన్ కొరవడినా కోహ్లీ, సిరాజ్ లు మాత్రం ఇంకా దానినే మెయింటైన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కోహ్లీ.. టెస్టు క్రికెట్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా కోహ్లీ రెండు ఇన్నింగ్స్ లలోనూ దారుణంగా విఫలమయ్యాడు.