- Home
- Sports
- Cricket
- సచిన్ తర్వాత నేను అంతగా ఎదురుచూసింది అతడి ఆట కోసమే.. ఇకనైనా ఆడించండి : సునీల్ గవాస్కర్
సచిన్ తర్వాత నేను అంతగా ఎదురుచూసింది అతడి ఆట కోసమే.. ఇకనైనా ఆడించండి : సునీల్ గవాస్కర్
IND vs SA T20I: టీమిండియా దిగ్గజ ఆటగాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురిపించాడు. అతడిని త్వరగా జట్టులోకి తీసుకోవాలని కోరాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి ప్రశంసల్లో ముంచెత్తాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో టీమిండియా రెండు మ్యాచులు ఓడిన నేపథ్యంలో ఇకనైనా ఉమ్రాన్ ను తీసుకోవాలని సన్నీ కోరాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ ను ఇకనైనా ఆడించాలి. ఇంక బెంచ్ మీద కూర్చోబెట్టింది చాలు..’ అని అన్నాడు. ఉమ్రాన్ ను తుది జట్టులోకి తీసుకుంటే అది అతడిలో స్పూర్తి రగిలిస్తుందని తెలిపాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత తాను ఇతడి ఆట చూడాలని ఎంతగానో వేచి చూసిన క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ అని గవాస్కర్ కొనియాడాడు.
‘నేను గతంలో సచిన్ ఆట చూడాలని ఎంతగానో ఉత్సాహపడేవాన్ని. ఆ తర్వాత అంతగా ఎగ్జైట్ చేసిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్. టీమిండియాలోకి అతడిని తీసుకుంటే అది అతడిలో స్ఫూర్తి నింపుతుంది..’ అని తెలిపాడు.
వైజాగ్ లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగబోయే మూడో టీ20 లో ఉమ్రాన్ ను లేట్ చేయకుండా ఆడించాలని సన్నీ అన్నాడు. భారత బౌలింగ్ విభాగం గత రెండు మ్యాచులలో దారుణంగా విఫలమైందని చెప్పాడు.
‘భువనేశ్వర్ తప్ప టీమిండియా బౌలర్లలో వికెట్ తీసే బౌలరే లేడు. అందుకే భారత్ వరుసగా రెండు మ్యాచులు ఓడింది. తొలి మ్యాచ్ లో భారీ స్కోరు చేసినా మన బౌలర్లు కాపాడుకోలేకపోయారు.
ఇక రెండో టీ20 లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది..’ అని అన్న గవాస్కర్.. ఇక లేట్ చేయకుండా ఉమ్రాన్ తో పాటు అర్షదీప్ ను కూడా తుది జట్టులో ఆడించాలని సూచించాడు.