13 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫైనల్లో ఆ నలుగురు... అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్ నుంచి...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి కొన్ని కోట్ల కళ్లు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. జూన్ 18 నుంచి ఇంగ్లాండ్లోని సౌంతిప్టన్ వేదికగా ఆరంభమయ్యే ఈ సుదీర్ఘ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్, ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో నలుగురు ప్లేయర్లు, 13 ఏళ్ల తర్వాత మళ్లీ నలుగురు ప్లేయర్లు మరోసారి ప్రత్యర్థులుగా తలబడబోతున్నారు. భారత సారథి విరాట్ కోహ్లీ 2008 అండర్ 19 వరల్డ్కప్ గెలిచిన జట్టుకి కెప్టెన్గా వ్యవహారించిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలబడింది భారత జట్టు. ఈ మ్యాచ్లో ప్రస్తుత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ న్యూజిలాండ్ అండర్19 జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాడు.
అప్పుడు విరాట్ కోహ్లీ టీమ్లో ఉన్న రవీంద్ర జడేజా భారత జట్టులో ఆల్రౌండర్గా కొనసాగుతుండగా, కేన్ విలియంసన్ టీమ్లో ఉన్న టిమ్ సౌథీ కివీస్కి మెయిన్ బౌలర్రా మారాడు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో ఏకంగా 6 వికెట్లు తీసి అదరగొట్టాడు టిమ్ సౌథీ. 25.1 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టిన సౌథీ, న్యూజిలాండ్కి తొలి ఇన్నింగ్స్లో 103 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందించాడు.
అండర్19 వరల్డ్ కప్ సెమీస్లో భారత జట్టు డక్త్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కేన్ విలియంసన్ 37 పరుగులు చేయగా, కోరీ అండర్సన్ 70 పరుగులు చేసి అదరగొట్టాడు.
లక్ష్యచేధనలో సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ శ్రీవాత్సన్ గోస్వామి 51 పరుగులు, విరాట్ కోహ్లీ 43 పరుగులు, సౌరబ్ తివారీ 29, మనీశ్ పాండే 18 పరుగులు చేసి గెలిపంచారు.
ఈ మ్యాచ్ తర్వాత 11 ఏళ్లకు మళ్లీ 2019 వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో తలబడ్డారు ఈ నలుగురు ప్లేయర్లు. ఆ మ్యాచ్లో కివీస్ 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 11 ఏళ్ల క్రితం కోహ్లీ సేన చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు కేన్ విలియంసన్. అయితే ఆ మ్యాచ్లో సౌథీ బరిలో దిగలేదు.
ఇప్పుడు భారత జట్టు 2019 వన్డే వరల్డ్కప్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులోనే ఆధిక్యంలో కొనసాగుతోంది న్యూజిలాండ్. అంటే అక్కడ కండీషన్స్ వారికి ఎంత అనుకూలిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే న్యూజిలాండ్ సారథి కేన్ విలియంసన్, మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 13 పరుగులు చేసి అవుటైన విలియంసన్, రెండో ఇన్నింగ్స్లో 1 పరుగుకే పెవిలియన్ చేరాడు.
అయితే కేన్ విలియంసన్ ఫామ్ను తేలిగ్గా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే విలియంసన్ కీలక మ్యాచుల్లో అద్భుతంగా రాణిస్తాడు. వన్డే వరల్డ్కప్లో కూడా కేన్ విలియంసన్ చేసిన 67 పరుగులు ఎంతో అమూల్యమైనవి.
ఇప్పుడు భారత జట్టుకి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కంటే కూడా బౌలింగ్ విభాగం నుంచే ఎక్కువ సమస్యలు ఎదురైన సూచనలు ఇప్పటినుంచే కనిపిస్తున్నాయి. కాబట్టి మనోళ్లు ఫైనల్నాటికి కివీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో పక్కాగా ప్లాన్ చేసుకుంటేనే బెటర్.
లేదంటే ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లీష్ బ్యాట్స్మెన్నే వణికించిన న్యూజిలాండ్ బౌలర్లు, భారత బ్యాట్స్మెన్ను చాలా తేలిగ్గా పెవిలియన్ చేర్చగలరు. పేస్ బౌలింగ్ పిచ్ల మీద మనవాళ్లు ఏ విధంగా రాణిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.