అమ్మపాలు అంగడిపాలు..! 300 ML తల్లి పాలకు రూ.4,500 వసూలు చేస్తున్న సంస్థ, అనుమతులు లేకుండానే భారత్లో వ్యాపారం
కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్న తరహాలో అమ్మపాలను సైతం డబ్బాల్లో పోసి వ్యాపారం చేసే సంస్థలు నేడు మార్కెట్లో తయారు అయ్యాయి. అలాంటి సంస్థలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉండగా, ప్రస్తుతం మన దేశంలో కూడా అలాంటి సంస్థలు పురుడు పోసుకున్నాయి. అయితే తల్లి పాలను అంగడి పాలు చేస్తారా అంటూ, పలువురు యాక్టివిస్టులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అమ్మపాలను విక్రయించే సదరు సంస్థ చిక్కుల పాలయ్యింది.
డబ్బు ఉంటే ఏదైనా కొనవచ్చు, కానీ తల్లి ప్రేమను అనేది ఓ సామెత, కానీ ఆతల్లి ప్రేమకు ప్రతి రూపం అయిన తల్లి పాలను సైతం మార్కెట్లో అమ్మేందుకు ఓ వ్యాపార సంస్థ మన దేశంలో పుట్టుకొచ్చింది. నియోలాక్టా లైఫ్సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (NLPL) పేరిట ఆసియాలో తల్లి పాలను విక్రయించే ఏకైక సంస్థగా పేరున్న ఈ కంపెనీ, భారతదేశంలో కూడా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ తల్లి పాలను విక్రయించడంపై ఇటీవల కొందరు యాక్టివిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కంపెనీ లైసెన్స్ను రద్దు చేసింది.
భారతదేశంలో తల్లి పాలను విక్రయించడానికి అనుమతి లేదని ఈ సందర్బంగా FSSAI తెలిపింది. నవంబర్ 2021లో మంజూరు చేసిన ఆయుష్ లైసెన్స్ పై కంపెనీ తన ఉత్పత్తి తల్లి పాలు(Breast Milk) ని విక్రయిస్తోంది. నిజానికి సదరు సంస్థ FSSAI నుండి పాల ఉత్పత్తులను విక్రయించడానికి లైసెన్స్ పొందింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... నియోలాక్టా 2016 సంవత్సరంలో స్థాపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ కథనం ప్రకారం, కంపెనీ నిజానికి డెయిరీ ఉత్పత్తుల విభాగంలో FSSAI కర్ణాటక కార్యాలయం నుండి లైసెన్స్ పొందింది. తల్లి పాలను సేకరించి పాల ఉత్పత్తిగా విక్రయించేందుకు ఓ కంపెనీకి అనుమతి ఇవ్వడం పూర్తిగా దిగ్భ్రాంతి కలిగించే విషయం అని బ్రెస్ట్ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియాకు చెందిన నుపుర్ బిదాలా అన్నారు.
నియోలాక్టా ఎండీ సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో తొలి మిల్క్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం ద్వారా మానవ పాల సరఫరా సాంకేతికతలో కంపెనీకి అనుభవం ఉందని చెప్పారు. నియోలాక్టా గత ఐదేళ్లలో 450 ఆసుపత్రులలో 51,000 మందికి పైగా నవజాత శిశువులకు ప్రయోజనం చేకూర్చింది. స్వచ్ఛందంగా తల్లులు ముందుకు వచ్చి దానం చేసిన తల్లి పాలను భద్రపరిచి అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఇస్తామని తెలిపారు.
అయితే నిజానికి బ్లడ్ బ్యాంకు తరహాలోనే హ్యూమన్ మిల్క్ బ్యాంక్ లాభాపేక్ష లేని వ్యాపారం. భారతదేశంలో 80కి పైగా లాభాపేక్షలేని మానవ మిల్క్ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ముందుగా తల్లుల నుంచి సేకరించిన పాలను పరీక్షిస్తారు. అందులో పోషకాల మొత్తాన్ని నిర్ణయించి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని నవజాత శిశువులకు తల్లి పాలు ఉచితంగా అందజేస్తున్నారు. కానీ ఖర్చు భరించగలిగే వారి నుంచి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ద్వారా 50 ఎంఎల్ పాలకు చార్జ్ వసూలు చేస్తున్నారు.
కానీ నియోలాక్టా కంపెనీ 300 మి.లీ గడ్డకట్టిన తల్లి పాలకు రూ.4,500 వసూలు చేస్తోంది. అలాగే తల్లి పాల పౌడర్ ను సైతం తమ కంపెనీ ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయిస్తోంది ఒక ప్రీ-టర్మ్ బేబీకి రోజుకు 30 ml తల్లి పాలు అవసరం కావచ్చు. అదే సమయంలో, ఆరోగ్యకరమైన బిడ్డకు రోజుకు 150 ml పాలు అవసరం కావచ్చు. FSSAI బెంగళూరు శాఖ అధికారులు ఏప్రిల్ 22న నియోలాక్టా యూనిట్ను తనిఖీ చేశారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించిన మెటీరియల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక FSSAI కార్యాలయం తన ఉత్పత్తులన్నింటినీ మార్కెట్ నుండి ఉపసంహరించుకోవాలని కంపెనీని కోరింది. చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్ లేకుండా ఆహార వ్యాపారాన్ని కొనసాగించినందుకు కంపెనీకి నోటీసు కూడా జారీ చేసింది.