Indian Railways: ఇండియన్ రైల్వేను మార్చిన ప్రయాణికుడు ఇబ్బంది.. కామెడీగా ఉన్నా చరిత్రను మలుపు తిప్పింది
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఇండియన్ రైల్వే ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది ఇండియన్ రైల్వే. 170 ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయ రైల్వే ముఖచిత్రం మారడానికి ఒక కామెడీ సంఘటన కారణమైందని మీలో ఎంత మందికి తెలుసు.?

Brazil Railway
ప్రపంచంలో ఎక్కువ మందికి ఉద్యోగం కల్పిస్తున్న సంస్థల్లో ఇండియన్ రైల్వే ఒకటి. 170 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర మన భారత రైల్వేకు సొంతం. బ్రిటీషర్ల కాలంలోనే భారత్లో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైళ్లలో ప్రయాణం చేయడానికి మొగ్గు చూపడానికి ప్రధాన కారణాల్లో టాయిలెట్స్ ఒకటి. ఇతర ప్రయాణాల్లో ఇలాంటి సదుపాయం ఉండదు. ఒక్క రైళ్లలోనే బాత్రూమ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఒకప్పుడు రైళ్లలో బాత్రూమ్స్ లేవనే విషయం మీకు తెలుసా.? ఓ ప్రయాణికుడికి జరిగిన ఇబ్బంది ఇండియన్ రైల్వేను మార్చేసింది.

వివరాల్లోకి వెళితే.. 1909లో ఒకీల్ చంద్రసేన్ అనే ప్రయాణికుడు రైళ్లో ప్రయాణం చేస్తున్నాడు. అదే సమయంలో అతనికి అర్జెంట్గా టాయిలెట్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో సాహిబ్జంగ్ అనే రైల్వే స్టేషన్లో రైలు ఆగిన సమయంలో బాత్రూమ్కు వెళ్లాడు. అంతలోనే రైలు కదలడం మొదలైంది. దీంతో చేతిలో నీళ్లతో ఉన్న చంద్రసేన్ రైలును అందుకోవడానికి పంచను చేత్తో పట్టుకొని అలాగే పరిగెత్తాడు. ఆ సమయంలో అక్కడున్న వారంతా అతన్ని చూశారు నవ్వారు. దీంతో దీనిని చాలా సీరియస్గా తీసుకున్న ఆ ప్రయాణికుడు రైల్వే అధికారులకు ఓ లేఖ రాశాడు.
రైలులో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అసౌకర్యంగా ఉందని. సమస్యను పరిష్కరించడానికి రైళ్లలో టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చంద్రసేన్ తన లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ విషయాన్ని అప్పటి రైల్వే అధికారులు బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రైళ్లలో టాయిలెట్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి రైళ్లలో టాయిలెట్స్ సౌకర్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఓ సామాన్యుడు రాసిన లేఖ ఇండియన్ రైల్వే ముఖ చిత్రాన్నే మార్చేసింది.
ఆ తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా టాయిలెట్ల శుభ్రత పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. రైళ్లలో నీటి సరఫరా మెరుగుపరిచింది. క్రమంగా, బయో-టాయిలెట్లు, ఆటోమేటిక్ ఫ్లషింగ్ సిస్టమ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ప్రయాణికుడు రాసిన లేఖ ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆ లెటర్ను న్యూఢిల్లీలోని రైల్వే మ్యూజియంలో భద్రంగా దాచి పెట్టారు. ఒక వ్యక్తి ఆలోచన, ఒక చిన్న లేఖ సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో చెప్పేందుకు ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.

