మరోసారి భారతదేశ అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ.. ప్రపంచ ధనవంతుడిగ టెస్లా సిఈఓ..
కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైన సంగతి మీకు తెలిసిందే. కానీ ఈ కాలంలో ప్రపంచంలోని చాలా మంది బిలియనీర్లకు కరోన కలిసొచ్చింది. 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021' ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ, ప్రపంచంలో 8వ ధనవంతుడిగ నిలిచాడు. ఒక నివేదిక ప్రకారం ముకేష్ అంబానీ సంపద ఈ కాలంలో 24 శాతం పెరిగింది. ముకేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ 83 బిలియన్ డాలర్లు.
భారతదేశంలోని అత్యంత ధనవంతులు..
భారతదేశంలో 83 బిలియన్ డాలర్ల సంపదతో ముకేష్ అంబానీ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అలాగే గ్లోబల్ జాబితాలో అతను ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రెండవ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఇతని సంపద 32 బిలియన్ డాలర్లు. ప్రపంచ జాబితాలో గౌతమ్ అదానీ 48వ స్థానంలో ఉండగా, 27 బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నాదర్ & ఫ్యామిలీ భారతదేశంలో మూడవ స్థానంలో ఉన్నారు.
వీరు ప్రపంచ జాబితాలో 58వ స్థానంలో నిలిచారు. ఆర్సెలర్ మిట్టల్ గ్రూపుకు చెందిన లక్ష్మి ఎన్ మిట్టల్ ప్రపంచ జాబితాలో 104వ ధనవంతుడు. కానీ భారతదేశంలో ఆయన నాల్గవ అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త. సీరం ఇన్స్టిట్యూట్ సైరస్ పూనవాలా భారతదేశంలో ఐదవ ధనవంతుడు. అతని సంపద 18.5 బిలియన్ డాలర్లు.
ప్రపంచంలోని అత్యంత ధనవంతులు
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 నివేదిక ప్రకారం టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) ఎలోన్ మస్క్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. అతని సంపద తాజాగా 328 శాతం పెరిగి 197 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితాలో రెండవ స్థానంలో అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్ ఉన్నారు. అమెజాన్ ఆస్తులు కరోనా కాలంలో 35 శాతం పెరిగాయి. జెఫ్ బెజోస్ నికర విలువ 189 బిలియన్లుగా అంచనా వేశారు.
దీని తరువాత 3వ స్థానంలో 114 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎల్ఎమ్విహెచ్కు చెందిన బెర్నార్డ్ ఓర్నాల్ట్ ఉన్నారు. అతని సంపద కూడా కరోనా సమయంలో ఏడు శాతం పెరిగింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద నాలుగు శాతం పెరిగి నాల్గవ స్థానానికి చేరుకున్నారు. అతని మొత్తం ఆస్తుల విలువ 110 బిలియన్ డాలర్లు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ 101 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలో ఐదవ ధనవంతుడిగా ఉన్నారు.
mark tim
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 10వ ఎడిషన్ ప్రకారం 2020లో ప్రపంచం మొత్తంగా ప్రతి వారం ఎనిమిది మంది కొత్త వ్యక్తులు బిలియనీర్లుగా మారారు అలాగే ఈ సంవత్సరంలో 421 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరారు. దీనితో ప్రపంచంలోని మొత్తం బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 3,288 కు పెరిగింది. ఈ 3,288 బిలియనీర్లు 68 దేశాల ఉన్నారు.
చైనా జిడిపికి సమానమైన బిలియనీర్ల సంపద
ప్రపంచవ్యాప్తంగా మొత్తం బిలియనీర్ల సంపద 32 శాతం పెరిగి 147 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బిలియనీర్ల సంపద గత సంవత్సరంలో జర్మనీ జిడిపితో సమానంగా ఉండగా ఇప్పుడు చైనా జిడిపితో సమానంగా ఉంది.