- Home
- Business
- గోల్డ్ లోన్లో కీలక మార్పులు.. అలా చేస్తే కస్టమర్లకు బ్యాంకులు రోజుకు రూ. 5వేల ఫైన్ కట్టాల్సిందే
గోల్డ్ లోన్లో కీలక మార్పులు.. అలా చేస్తే కస్టమర్లకు బ్యాంకులు రోజుకు రూ. 5వేల ఫైన్ కట్టాల్సిందే
Gold Loan: తక్కువ వడ్డీ, సింపుల్ ప్రాసెస్ ఉండడంతో బంగారంపై రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే తాజాగా గోల్డ్ లోన్స్లో నిబంధనల్లో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ఆ నిబంధనలు ఏంటి.? ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే..

రుణ చెల్లింపు నిబంధనలో కీలక మార్పు
బంగారం లేదా వెండి తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని కస్టమర్ తిరిగి చెల్లించిన వెంటనే బ్యాంకు ఆ వస్తువులను తిరిగి ఇవ్వాలి. అయితే ఏవైనా సాంకేతిక కారణాల వల్ల అదే రోజు ఇవ్వలేకపోతే, గరిష్టంగా ఏడు పని దినాల్లోపు తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలి. బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ ఆలస్యం చేస్తే, రోజుకు రూ. 5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది కస్టమర్లకు రక్షణ కల్పించే ముఖ్యమైన నిర్ణయంగా ఆర్బీఐ పేర్కొంది.
LTV నిష్పత్తిలో పెరుగుదల
* ఆర్బీఐ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం Loan-to-Value (LTV) నిష్పత్తిలో మార్పులు చేశారు. రూ. 2.5 లక్షల వరకు రుణాలపై LTV 75% నుండి 85%కి పెంచారు.
* ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షల విలువైన బంగారం లేదా వెండి తాకట్టు పెడితే, రూ. 1.7 లక్షల వరకు రుణం పొందవచ్చు.
* రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలపై 80% విలువ పరిగణిస్తారు.
* రూ. 5 లక్షలకు పైగా రుణాల కోసం 75% విలువ ఆధారంగా రుణం లభిస్తుంది. అంటే, మీరు రూ. 6 లక్షల రుణం తీసుకోవాలంటే కనీసం రూ. 8 లక్షల విలువైన బంగారం లేదా వెండి తాకట్టు పెట్టాలి.
తాకట్టు పెట్టడానికి అనుమతించే వస్తువులు
ఆర్బీఐ ప్రకారం, బంగారు బిస్కెట్లు లేదా వెండి కడ్డీలు (Bars) రుణాల కోసం తాకట్టు పెట్టరాదు. బంగారు భరణాలు, వెండి ఆభరణాలు, బంగారు, వెండి దీపాలు, గిన్నెలతో పాటు ఇతర వస్తువులు తాకట్టుకు పనికొస్తాయి.
తాకట్టు పరిమితులు నిర్ణయం
కొత్త మార్గదర్శకాల ప్రకారం, తాకట్టు పెట్టే బంగారం, వెండి పరిమితులను స్పష్టంగా నిర్ణయించారు. వీటి ప్రకారం..
* బంగారు ఆభరణాలు: గరిష్టంగా 1 కిలో
* బంగారు నాణేలు: 50 గ్రాములు వరకు
* వెండి ఆభరణాలు: గరిష్టంగా 10 కిలోలు
* వెండి నాణేలు: 500 గ్రాములు వరకు
ఇది చెల్లుబాటు అయ్యే పరిమితి. దీని కంటే ఎక్కువ తాకట్టు బ్యాంకులు స్వీకరించవు.
ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది.?
ఆర్బీఐ ప్రకటించిన ఈ కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు, కోఆపరేటివ్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs) పాటించాల్సి ఉంటుంది.