పాత కారు అమ్మితే 18 శాతం జీఎస్స్టీ చెల్లించాల్సిందే.. ఇందులో అసలు నిజమేంటంటే..
ఇటీవల జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో వినియోగించిన విద్యుత్ కార్ల అమ్మకం మీద 18 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కారు అమ్మకం ద్వారా కలిగే లాస్ మార్జిన్ మీద అమ్మకందారుడు 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇంతకీ ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది.? లాంటి వివరాలను నాగార్జున మున్నురు గారు తన ఫేస్బుక్ వాల్పై పోస్ట్ చేశారు. ఇందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇప్పుడు చూద్దాం..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై భారం పడే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక కారును రూ. 20 లక్షలకు కొన్న వ్యక్తి కొన్నేళ్ల తర్వాత ఆ కారును రూ. 4 లక్షలకు అమ్మితే వచ్చే నష్టం రూ.16 లక్షలు. ఈ రూ. 16 లక్షల మీద 18% జీఎస్టీ అంటే రూ. 2.88 లక్షలు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని, దీనికంటే కారును ఎవరికైనా ఉచితంగా ఇవ్వడమో లేదా అలాగే ఇంట్లోనే పెట్టుకోవడం ఉత్తమం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిలో ఉన్నత చదువులు చదివినవారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఇది అవగాహన రాహిత్యంతో చేస్తున్న తప్పుడు ప్రచారం.
అసలు వాస్తవం ఏమిటో చూద్దాం..
1. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రత్యక్షంగా జరిగే కారు క్రయవిక్రయాలకు జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.
2. సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్లు మాత్రమే 18శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మొత్తం రీసేల్ అమౌంట్పై కాదు, మార్జిన్ విలువపై మాత్రమే. అంటే డీలర్ కారును కొనుగోలు చేసిన ధర, రీసేల్ చేసిన ధర మధ్య మార్జిన్ విలువ మీద మాత్రమే ఈ 18 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్ రూ. 8 లక్షలకు ఒక విద్యుత్ కారును కొనుగోలు చేసి, అదే కారును రూ. 9 లక్షలకు ఇతరులకు విక్రయిస్తే, లాభం మార్జిన్ ఆయిన రూ. 1 లక్ష మీద 18 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సెకండ్ హ్యాండ్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అన్ని మోటారు వాహనాల మీద విధించే పన్ను విధానం ఏకరీతిగా మార్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఎస్టీ
కౌన్సిల్ అధికారిక ప్రకటనతో ఈ వివరణ ఇచ్చింది కానీ ఈ నిర్ణయం సెకండ్-హ్యాండ్ కార్ల మార్కెట్ను భయాందోళనకు గురిచేసిందనేది వాస్తవం. పెరిగిన పన్ను భారం అంతిమంగా వినియోగదారులు భరించాల్సి రావడం వల్ల సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు తగ్గుతాయనే ఆందోళన మొదలైంది.
నా వ్యక్తిగత అభిప్రాయం:
మనదేశంలో ప్రస్తుతం అలవుతున్న జీఎస్టీ పన్ను విధానం, స్లాబ్స్ అంతలా బాగాలేదు. నూతన జీఎస్టీ నమోదు నుంచి లంచాలు చెల్లించాల్సి రావడం, జీఎస్టీ నమోదు కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి రావడం కొత్తగా వ్యాపారాలను ప్రారంభించే వారికి శాపంగా మారింది. ఈజ్ ఆఫ్ డూఇంగ్ బిజినెస్ లో 2014 లో 142 ర్యాంకు నుంచి 2021 నాటికి 63 ర్యాంకుకి వచ్చినట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఇంకా దారుణమైన స్థితిలో ఉంది అన్నది నా వ్యక్తిగత అనుభవం.
ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో తీసుకువచ్చిన జీఎస్టీ పన్ను పరిధిలోకి ఇప్పటివరకు మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు తీసుకు రాకపోవడం, దానికి రాష్ట్రాలు అడ్డుగా ఉన్నాయి అని సాకులు చూపడం ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు దండుకోవడం కోసమే అన్నది స్పష్టం. మోదీ ప్రభుత్వం నాలుగవ సారి అధికారంలోకి రావాలంటే ముందు ప్రజల్లో అత్యంత నెగటివ్ మార్కులు తెచ్చుకున్న ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ను మార్చడం, జీఎస్టీ, ఆదాయపు పన్ను లను సరళతరం చేసి మధ్యతరగతికి ఊరట నివ్వడం అత్యంత ముఖమైన విషయం.
నాగార్జున మున్నురు ఫేస్బుక్ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.