ఇటు అప్పులు.. అటు మార్కెట్లు: తీవ్ర ఒత్తిడితో సిద్ధార్థ ఇలా
సంస్థ స్థాయిని మించి చేసిన అప్పులు కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణానికి దారి తీశాయి. స్థాయికి మించి పెరిగిన రుణాలకు తోడు పరిస్థితులను బట్టి మార్కెట్లలో సంస్థ షేర్ల పతనం కూడా ఆయనపై ఒత్తిడి పెంచాయి. చివరి క్షణం వరకు కొత్త అప్పుల కోసం ప్రయత్నించిన కేఫ్ కాఫీ అధినేత వీజీ సిద్ధార్థ చివరకు తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాఫీ బిజినెస్ మొగల్గా పేరు తెచ్చుకున్న వీజీ సిద్ధార్థ.. స్థాయికి మించి అప్పులు పెరిగిపోయి మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో సకాలంలో అప్పు లభించనందునే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఆయన తన చివరి లేఖలో పేర్కొన్నారు. తాను ఒక విఫల వ్యాపారవేత్తనని రాయడం వెనుక అసలు వాస్తవాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.
సిద్ధార్థ కుటుంబానికి కాఫీడే ఎంటర్ప్రైజెస్లో (సీడీఈ) 53.43 శాతం మేర వాటా ఉంది. ఇందులో 75 శాతం వాటాలు తాకట్టులో ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే సిద్ధార్థకు సీడీఈలో 32.75 శాతం వరకు వాటా ఉంది. వీటిల్లోనూ 70 శాతం తాకట్టులోనే ఉన్నాయి. ఆయన ఈ రుణాలను వివిధ వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలో రుణ భారాన్ని తగ్గించుకొనేందుకు సిద్ధార్థ మే3 నాటికి మైండ్ట్రీలో సీడీఈకి ఉన్న వాటాలను విక్రయించగా రూ.2,100 కోట్ల సొమ్ము వచ్చింది.
దీనిపై మే 24 కాన్ఫరెన్స్ కాల్లో వివరణనిస్తూ మైడ్ట్రీలో వాటా విక్రయంతో వచ్చిన సొమ్ముతో తనకు వ్యక్తిగతంగా ఉన్న రూ.600 కోట్ల అప్పును, సీడీఈ స్వల్పకాలిక రుణాలను తీర్చేసినట్లు వెల్లడించారు. పతనమవుతున్న మార్కెట్లు కాఫీడే సిద్ధార్థపై అన్నింటికంటే ఎక్కువగా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మార్చిలో సీడీఈలో ప్రమోటర్ల వాటా విలువ రూ.3,500 కోట్లుగా ఉంది. ఈ విలువ జూన్లో మైండ్ట్రీ అమ్మకం పూర్తైన తర్వాత రూ.2,600 కోట్లకు చేరింది.
మార్చి18న మైండ్ట్రీలో వాటాల విక్రయంతో షేర్ రేటు రూ. 309కి చేరింది. కానీ తర్వాత కంపెనీ షేర్లు క్రమంగా కుంగటం ప్రారంభమైంది. దీంతో తాకట్టులో ఉన్న 75 శాతం వాటాల విలువ కూడా పడిపోయింది. ఫలితంగా రుణం కోసం ఇచ్చే తాకట్టు ఆస్తి విలువను సమానం చేయడం కోసం అదనపు షేర్లు గానీ, ఇతర ఆస్తులు కానీ తాకట్టు పెట్టాల్సి రావడంతో సిద్ధార్థపై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో మైండ్ట్రీలో వాటాలు విక్రయించినా సీడీఈ అప్పుల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఫలితంగా సిద్ధార్థ తీవ్ర ఒత్తిడికి గురైనట్టుగా తెలుస్తోంది.
బ్రోకరేజ్ సంస్థల లెక్కల ప్రకారం గతేడాది మార్చి నాటికి సీడీఈకి రూ.2,323 కోట్ల అప్పు ఉంది. ఇది ఈ ఏడాది మార్చి నాటికి రూ.4,068 కోట్లకు పెరిగింది. సీడీఈ ఒక పబ్లిక్ ఆఫర్ ద్వారా 2015లో రూ.1,000 కోట్లు సమీకరించింది. అప్పట్లో డెట్ టు ఈక్విటీ నిష్పత్తిని 1.7 రెట్లుగా చూపగా.. ఇది 2019 నాటికి 2.6 రెట్లకు చేరింది.
దీనికి తోడు కంపెనీ మొత్తం ఆస్తులు అమ్మితే వచ్చే సొమ్ము అప్పుల చెల్లింపులకే సరిపోయే స్థితికి చేరింది. ఈ విషయం కూడా సిద్ధార్థపై తీవ్ర ఒత్తిడిని పెంచినట్టుగా తెలుస్తోంది. దీంతో సిద్ధార్థ తన అదృశ్యానికి ఒక రోజు ముందు రూ.1600 కోట్ల అప్పు కోసం దేశంలోని అతిపెద్ద బ్యాంకర్లలో ఒకరి వద్దకు వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఫలితంగానే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.