ఇకపై ఏ నెట్వర్క్ నుంచైనా కాల్స్ చేసుకోవచ్చు: అదే ఇంట్రా సర్కిల్ రోమింగ్
జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వినియోగదారులు తమ సిమ్ సిగ్నల్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్ ద్వారానైనా కాల్స్ చేసుకోవచ్చు. దీన్నే ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసీఆర్) అంటారు. ఈ సౌకర్యాన్ని ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐసీఆర్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం రండి.

తమ సిమ్ సిగ్నల్ లేకపోయినా జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వినియోగదారులు అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్ ద్వారానైనా కాల్స్ చేసుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసిఆర్) సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. డిజిటల్ భారత్ నిధి (డిబిఎన్) నిధులతో ఏర్పాటైన ఏ 4G నెట్వర్క్ టవర్ నుంచైనా 4G సేవలు పొందవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన సిగ్నలింగ్ సేవలు అందించడానికి కేంద్రం అందిస్తున్న ఈ ఐసిఆర్ సేవల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఎవరికి వారికే ప్రత్యేకమైన సిగ్నలింగ్ టవర్స్ ఉంటాయి. ఒక నిర్ణీత లెక్క ప్రకారం ఆయా టెలికాం సర్వీసులు గ్రామాలు, పట్టణాల్లో టవర్స్ ఏర్పాటు చేస్తాయి.
అయితే ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన మొబైల్ టవర్లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు షేర్ చేసుకొని తమ వినియోగదారులకు సేవలు అందించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. తద్వారా వివిధ నెట్వర్క్లకు చెందిన వినియోగదారులు ఒకే టవర్ నుండి 4G కనెక్టివిటీని పొందవచ్చు. ఈ విధానం ప్రతి ప్రొవైడర్కు ఎక్కువ టవర్లు ఏర్పాటు చేసే అవసరాన్ని తగ్గిస్తుంది.
ఒకే టవర్ పై బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్-ఐడియా కంపెనీలు తమ సిగ్నలింగ్ డివైజ్ ల ద్వారా సిగ్నల్స్ అందించడం వల్ల ప్రజలు అదనపు ఖర్చులు లేకుండా మెరుగైన మొబైల్ సేవలను పొందుతారు.
కేంద్ర ప్రభుత్వం దాదాపు 27,000 టవర్లను ఉపయోగించి, 35,400 కంటే ఎక్కువ గ్రామీణ, మారుమూల గ్రామాలకు నమ్మకమైన 4G కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఐసిఆర్ ప్రాజెక్ట్ ను చేపట్టింది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 4G మొబైల్ సైట్లలో ఐసిఆర్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్ వంటి మూడు ప్రధాన టెలికాం కంపెనీలు తమ నెట్వర్క్లను పంచుకోవడానికి అంగీకరించాయని సింధియా తెలిపారు.
దేశవ్యాప్తంగా దాదాపు 27,836 సైట్లలో టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా దేశవ్యాప్తంగా వినియోగదారులకు మొబైల్ సేవలకు సంబంధించి అదనపు ఎంపికలను అందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం డిబిఎన్ నిధులతో టవర్ను ఏర్పాటు చేసిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్ సేవలను మాత్రమే వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఇతర టెలికాం కంపెనీల వినియోగదారులు ఈ టవర్లను యాక్సెస్ చేయలేరు.