మాంద్యం ఎఫెక్టే: 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు హీరో ‘వీఆర్ఎస్’
ప్రముఖ దేశీయ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 40 ఏళ్లు దాటిన వారికి, వరుసగా ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న వారికి వీఆర్ఎస్ ఇవ్వ సంకల్పించింది. వారి రిటైర్మెంట్ సమయాన్ని లెక్క గట్టి మరీ భారీ మొత్తంలో పరిహారం అందజేయనున్నది. ఉద్యోగులకు, వారి పిల్లలకు భవిష్యత్లో రకరకాల ఆఫర్లు అందజేస్తున్నది.
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం.. ఆటోమొబైల్ వాహనాల విక్రయాలు నెమ్మదించిన నేపథ్యంలో హీరో మోటో కార్ప్స్ సంచలన నిర్ణయం తీసుకున్నది. తన సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించింది. ఉత్పాదకత, సామర్థ్యం పెంచుకోవడానికే వీఆర్ఎస్ ప్రకటించామని హీరో మోటో కార్ప్స్ పేర్కొంది.
40 సంవత్సరాలకు పై బడిన వయస్కులు, వరుసగా ఐదేళ్లు సర్వీసు గల ఉద్యోగులు ఈ నెల 28వ తేదీ లోపు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని హీరో మోటో కార్స్స్ ప్రకటించింది. పరిహార ప్యాకేజీలో భాగంగా ఉద్యోగికి కంపెనీలో పదవీ విరమణ చేయడానికి ఉన్న సమయం, పని చేసిన సమయం ఆధారంగా లెక్కించి, ఒకేసారి భారీ మొత్తం చెల్లిస్తుంది హీరో మోటో కార్ప్స్.
వీఆర్ఎస్ పథకం అమలుతోపాటు అదనపు బహుమతులు, మెడికల్ బెనిఫిట్లు, ల్యాప్ టాప్ కంప్యూటర్లు, కార్లపై రాయితీలు, వేరేచోటికి వెళ్లడానికి సాయం, ఉద్యోగి పిల్లలకు హీరో మోటో కార్ప్స్లో ఉద్యోగావకాశాలు, వ్యాపార అవకాశం కల్పించడం వంటి ఆఫర్లు ఉన్నాయి. త్వరితగతిన రిటైర్మెంట్ తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారిని ద్రుష్టిలో పెట్టుకునే తామీ వీఆర్ఎస్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చామని హీరో మోటో కార్ప్స్ అధికార ప్రతినిధి తెలిపారు. కరుణాస్ఫూర్తి, సానుభూతితో సంస్థ యాజమాన్యం పలు ఆఫర్లను అందిస్తోందన్నారు. ఈ ఆఫర్తో ఇటు సంస్థకు, అటు ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు.