బైక్ పై హీరోయిన్ తో ప్రముఖ హీరో.. నంబర్ పై ప్లేట్ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పై ఇండోర్ నివాసి జై సింగ్ యాదవ్ తన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ను అక్రమంగా సినిమాలో ఉపయోగించారంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశాడు. ఒక సినిమా సీక్వెన్స్ షూటింగ్ సమయంలోని సన్నివేశంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.
హీరో విక్కీ కౌశల్ నటి సారా అలీ ఖాన్తో కలిసి బైక్పై వెళ్తున్న ఫోటోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో జై సింగ్ యాదవ్ జనవరి 1న ఫిర్యాదు చేశారు. అయితే విక్కీ కౌశల్ నడుపుతున్న బైక్ నంబర్ ప్లేట్కు బోల్ట్ బిగించడం వల్ల పొరపాటు జరిగిందని పోలీసులు ఆ తర్వాత స్పష్టం చేస్తూ పేర్కొన్నారు.
విక్కీ కౌశల్ ఇండోర్ వ్యక్తి పై ఫిర్యాదు
కత్రినా కైఫ్తో పెళ్లి తర్వాత విక్కీ కౌశల్ తిరిగి షూటింగ్ కి హాజరయ్యాడు. ఇటీవలే ఇండోర్లో తన తదుపరి చిత్రం లుకా చుపి 2 షూటింగ్ను ప్రారంభించాడు. అయితే తన నంబర్ ప్లేట్ను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాడని ఇండోర్ నివాసి ఆరోపించడంతో చర్చనీయాంశంగా మారింది. ఇండోర్లోని బంగంగా నివాసి జై సింగ్ యాదవ్ మాట్లాడుతూ, “సినిమా సీక్వెన్స్లో ఉపయోగించిన వాహనం నంబర్ నాది. ఈ విషయం చిత్ర యూనిట్కి తెలిసిందో లేదో తెలియదు. ఇది చట్టవిరుద్ధం. వారు నా అనుమతి లేకుండా నా నంబర్ ప్లేట్ను ఉపయోగించలేరు. స్టేషన్లో మెమోరాండం ఇచ్చాను. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.
ఇండోర్లోని బంగంగా ప్రాంతానికి చెందిన సబ్-ఇన్స్పెక్టర్ రాజేంద్ర సోని స్పందిస్తూ, “మాకు ఈ విషయం పై ఫిర్యాదు అందింది. అక్రమంగా నంబర్ ప్లేట్ వాడారా లేదా అనేది విచారణలో చూడాలి. మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం దీనిపై చర్యలు తీసుకుంటాం. చిత్ర యూనిట్ ఇండోర్లో ఉంటే మేము వారిని విచారించడానికి ప్రయత్నిస్తాము అని అన్నారు.
స్పష్టం చేసిన పోలీసులు
సినిమా సీక్వెన్స్లో విక్కీ కౌశల్ ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్కు బోల్ట్ ఫిక్స్ చేయడం వల్ల అపార్ధం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం ఫిర్యాదుదారుడికి చెందినది కాదని, సినిమా నిర్మాణ సంస్థకు చెందినది పోలీసులు స్పష్టం చేశారు.
రాజేంద్ర సోనీ మాట్లాడుతూ, “మేము ఈ విషయాన్ని పరిశోధించాము. వాహనం నంబర్ 4872 (ఫిర్యాదుదారు ఆరోపించినట్లు) కాదని కనుగొన్నాము. బైక్ అసలు నంబర్ 1872 కానీ బోల్ట్ కారణంగా నంబర్ లోని 1 సంఖ్య 4 లాగా కనిపించింది. ఆ నంబర్ ప్లేట్కు వారికి పూర్తి అనుమతి ఉంది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము గుర్తించాము అని అన్నారు.