పవన్ కల్యాణ్ పోటీ నారా లోకేష్ మీదనా... గంటాపైనా
విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి పోటీ చేస్తారా, కోస్తాంధ్ర నుంచి పోటీ చేస్తారా, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా అంటూ చర్చ మెుదలైంది. పవన్ కళ్యాణ్ సైతం తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో అనే విషయంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. (పవన్ కళ్యాణ్)
విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి పోటీ చేస్తారా, కోస్తాంధ్ర నుంచి పోటీ చేస్తారా, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా అంటూ చర్చ మెుదలైంది. పవన్ కళ్యాణ్ సైతం తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో అనే విషయంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.
అనంతపురం జిల్లా పర్యటిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తాను అనంతపురం నుంచి పోటీ చేసి ఈ జిల్లాలో వెనుకబాటుతనాన్ని తరిమికొడతానంటూ ప్రగల్భాలు పలికారు. ఆ తర్వాత ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ జిల్లాతో ఉన్న సంబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు తన ఓటు హక్కును కూడా పశ్చిమగోదావరి జిల్లాలో నమోదు చేసుకున్నారు. దీంతో పవన్ పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు లేదా ఏలూరు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచి పోటీ చేశారు
ఆ ఎన్నికల్లో చిరంజీవి ఘోరంగా ఓటమి పాలయ్యారు. దాంతో ఈసారి పవన్ కళ్యాణ్ ను అక్కడ నుంచి పోటీ చెయ్యించి గెలిపించుకోవాలని ఆ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారు. ఇకపోతే వెనుకబడిన జిల్లాల నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా వచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి
అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది ఫిబ్రవరి నెలలో తెలియజేస్తానని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి నెల అయిపోయింది మార్చి నెలలోకి వచ్చేశాం కానీ పవన్ మాత్రం ఇంకా మౌనమే వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారా అంటూ అధికార తెలుగుదేశం పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆతృతగా ఎదురుచూస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా భీమిలి నియోజకవర్గానికి చెందిన కొందరు జనసేన పార్టీ నేతలు పవన్ ను తమ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలంటూ కోరారు
అంతేకాదు ఇటీవలే గాజువాక నియోజకవర్గానికి చెందిన నేతలు సైతం పవన్ ను కలిశారు. రాబోయే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ అని అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా అత్యధికంగానే ఉన్నాయని సమాచారం.
2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ భారీ విజయం సాధించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పోటీ చేసి భారీ విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో కూడా మరోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి పోటీ చెయ్యన్నారు. 2014 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినేట్ లో మంత్రిగా కూడా పనిచేశారు.
తిరిగి 2019 ఎన్నికల్లో గంటాయే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ వర్సెస్ మంత్రి గంటా పోరు ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇకపై విశాఖపట్నం జిల్లాకేంద్రంగా పవర్ సెంటర్ ను ఏర్పాటు చెయ్యాలని అలాగే ఉత్తరాంధ్రపై పట్టు సాధించాలని నారా లోకేష్ ఉన్నారట. ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ ఆ తర్వాత చంద్రబాబు కేబినేట్ లో మంత్రి అయ్యారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు.
నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారని ఒకసారి, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మరోసారి, కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేస్తారంటూ ఇంకోసారి, కాదు కడప జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే అత్యధికశాతం మంది వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్రలో ఏదో ఒక జిల్లా నుంచి పోటీ చెయ్యాలంటూ సూచించారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భీమిలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 9సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 6సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది.
దీంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్న నారా లోకేష్ భీమిలి నుంచిపోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని చూస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో భీమిలి నియోజకవర్గం ఇప్పుడు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది
2009 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత చిరంజీవి కుటుంబంతో ఉన్న సంబంధాన్ని క్యాష్ చేసుకుని 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు గెలుపొందారంటూ ప్రచారం జరగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుందని జనసేన కార్యకర్తలు సూచిస్తున్నారు.
ఒకవేళ వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్, టీడీపీ నుంచి తురుపుముక్క నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే ఇక భీమిలి నియోజకవర్గంలో త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. మరి ఆ హోరాహోరీ పోరులో చివరికి గెలిచేదెవరో అన్న చర్చ అప్పుడే మెుదలైపోయిందట.