భూమా కోరితేనే....: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
భూమా కోరితేనే....: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు: రాయలసీమ ప్రాంతం కుటుంబాల ఆధిపత్యంలో నలిగిపోతోందని, కుటుంబాల కంచుకోటల్ని బద్దలు కొట్టాలంటే ప్రజల్లో ధైర్యం రావాలని జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆళ్ళగడ్డ ఏ ఒక్క కుటుంబ గుత్తాధిపత్యం కాదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి బలమైన అభ్యర్ధిని బరిలో నిలబెడతామని వెల్లడించారు.
రాయలసీమలో ఎన్ని సీట్లు వస్తాయన్నది ముఖ్యం కాదు.. ఎంత మార్పు తీసుకొస్తామన్నది ముఖ్యమని పవన్ అన్నారు. తమ పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండబోవని అన్నారు. మంగళవారం సాయంత్రం ఆళ్ళగడ్డలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీకి ప్రచారం చేశానని పవన్ చెప్పారు. రాష్ట్రమంతా తిరిగాను కానీ ఆళ్ళగడ్డ రాలేదని అన్నారు. భూమా నాగిరెడ్డి తమ వాళ్లకు ఫోన్ చేసి మీరు వస్తే మా విజయావకాశాలు దెబ్బతింటాయి రావొద్దని కోరారని అన్నారు.
శోభానాగిరెడ్డి చనిపోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లిపోయానని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. 2019ఎన్నికల్లో మాత్రం ఆళ్ళగడ్డ నుంచి పేదలు కష్టాలు తెలిసిన వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడతామని చెప్పారు.
పాలెగాళ్లు అంటే అన్యాయానికి అడ్డంగా నిలబడేవాళ్లు. కానీ ఇవాళ రాయలసీమలో 60:40 శాతం రాజకీయం నడుస్తోందని పవన్ అన్నారు. నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టాలన్న అధికారపక్షం 60 శాతం, ప్రతిపక్షం 40 శాతం వాటాలు తీసుకుంటున్నాయని విమర్శించారు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ మధ్య కాలంలో 269 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వంగానీ, ప్రతిపక్షం గానీ గుర్తించడం లేదని విమర్శించారు. వాళ్ళకి రైతు మృత్యు ఘోష వినిపించదా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ గుర్తిస్తుందని, చనిపోయిన రైతు కుటుంబాల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు.
భారతదేశంపై హిందువులకు ఎంత హక్కు ఉందో.. ముస్లింలకీ అంతే హక్కు ఉందని పవన్ అన్నారు. పాకిస్థాన్ లో హిందువులకు ఎంత స్థానం ఇస్తారో తెలియదుగానీ, భారతదేశం ముస్లింలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని చెప్పారు. అందుకు నిదర్శనమే అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశామని, అజారుద్దీన్ ను ఇండియా క్రికెట్ టీమ్ కు కెప్టెన్ ను చేశామని చెప్పారు.
అంత గొప్ప ధార్మిక దేశం భారత్ అని పవన్ అన్నారు. ఇలాంటి దేశంలో ముస్లింలు దేశభక్తిని నిరూపించుకోవాలన్న వాదనను జనసేన తరఫున ఖండిస్తున్నానని చెప్పారు.
ఆళ్లగడ్డకు కూతవేటు దూరంలో శ్రీశైలం ప్రాజెక్టు ఉండికూడా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో దాహార్తి ఉందని ఆయన అన్నారు. కర్నూలు జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కూడా ఉందని చెప్పారు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ ఎందుకు చట్టసభల్లో దీనిగురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఆశయాలతో వచ్చిన జయప్రకాశ్ నారాయణ, చిరంజీవి లాంటి వారిని నిలబడనివ్వలేదని పవన్ అన్నారు. తాను చాలా మొండివాడిని.. పోతే ప్రాణాలు పోవాలి తప్ప ఆశయాలను పోనివ్వనని అన్నారు.
జగన్మోహన్రెడ్డి 30 ఏళ్లు తానే సిఎంగా ఉండాలనుకుంటున్నాడని పవన్ అన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తర్వాత తన కొడుకు 30 ఏళ్లు సిఎంగా ఉండాలని కోరుకుంటున్నాడని పవన్ అన్నారు. కానీ జనసేన పార్టీ మాత్రం 30 ఏళ్లు మీరు బాగుండాలని కోరుకుంటోందని చెప్పారు.