ఎలా వస్తావన్నారు: జగన్ ఇలాకాలో పవన్ కల్యాణ్ గర్జన
ఎలా వస్తావన్నారు: జగన్ ఇలాకాలో పవన్ కల్యాణ్ గర్జన
కడప: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారంనాడు పర్యటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతోగానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోగానీ జతకట్టదని, వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు 25 కేజీల బియ్యం, మూడు వేల రూపాయలు పాకెట్ మనీ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 10 లక్షలు చొప్పున 5 ఏళ్లు 50 లక్షల బీమా చేయిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
బుధవారం కడప నగరంలోని అన్నమయ్య సర్కిల్ లో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. వేలకోట్లు దోచేసి పిల్లికి బిచ్చం వేసినట్లు రూ. 2 వేలు, రూ. 3వేలు ఇస్తున్నారు. అమలు సాధ్యం కాని హామీలతో మీ జీవితాల్లో రత్నాలు కురిపిస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని అన్నారు.
తెలుగుదేశం పార్టీతో జనసేన జతకట్టిందని ప్రతిపక్ష పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో ఉతికి ఆరేసింది జనసేన పార్టీ గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని పవన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఆ దమ్ము లేదని, చట్ట సభల నుంచి పారిపోయారని ఆయన అన్నారు.
పదవిలో లేకపోయినా, పార్టీలో ఒక్క కౌన్సిలర్ లేకపోయినా అవినీతిపై బలంగా గళమెత్తింది జనసేన పార్టీయే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని పవన్ అన్నారు. ఆ పార్టీకి ఆ దమ్ము, ధైర్యం లేవని, తమ పార్టీ నుంచి ఎవరూ చట్టసభలకు వెళ్లకపోయినా అనంతపురంలో మహిళల అక్రమ రవాణాను అడ్డుకున్నామని చెప్పారు. భయపెట్టి పాలించేవాడు నాయకుడు కాదుని, స్వేచ్ఛనిచ్చే వాడు నాయకుడని అన్నారు.
మంచి ఆశయాలతో చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అయితే పార్టీలో ఉన్న నాయకుల ఒత్తిడిని తట్టుకోలేకపోయారని, దీంతో పార్టీని ముందుకు తీసుకెళ్లలేక కాంగ్రెస్ లో వీలినం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ మాత్రం సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ అని చెప్పారు.
మీ అవినీతి కోటలు బద్దలు కొట్టి తీరుతాం. మీ ఫ్యూడల్ కోటలు బద్దలు కొడతామని, మీరు భయపెట్టి పాలిద్దాం అంటే ఇది 2009 కాదు 2019 గుర్తించుకోండి అని పవన్ విరుచుకుపడ్డారు. దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్నాం కొమ్ములు పీకిపారెస్తామని అన్నారు.
రెడ్డి అంటే రక్షించేవాడే కానీ దోపిడి చేసేవాడు కాదని కర్నూలు సభలో మాట్లాడానని, మరుసటిరోజే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు తన దగ్గకు వచ్చి ఆనందపడ్డారని, తాను ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని, అందుకే నా పేరు వెనుక రెడ్డి, నాయుడు, చౌదరి అని ఉండవని చెప్పుకున్నారు.
తాను కులం లేని వాడినని, తన నలుగురి పిల్లల్లో ఇద్దరిది హిందుమతమయితే ఇద్దరిది క్రిస్టియన్ మతమని, తన సన్నిహితులు ఎక్కువగా ఇస్లాం మతం పాటిస్తారని, కులాలను కలిపే రాజకీయం చేయడానికి వచ్చాను తప్ప, కులాలను విడదీసే రాజకీయాలను చేయనని పవన్ కల్యాణ్ అన్నారు.
రాయలసీమ పర్యటనకు వస్తున్నానంటే చాలామంది నాయకులు ఎలా వస్తారో మేము చూస్తామంటూ బెదిరింపులకు దిగారని పవన్ అంటూ ఆత్మగౌరవం, పౌరుషం ఉన్నవాడిని కిరాయిమూకలకు, ప్రైవేటు సైన్యానికి భయపడేవాడిని కాదని అన్నారు.
రాయలసీమను నాయకులు భయం గుప్పెట్లో పెట్టారని, సీమకు కావాల్సింది స్వేచ్ఛ. రాయలసీమలో తొండ కూడా గుడ్లు పెట్టలేనంత క్షామం ఉందంటారని పవన్ అన్నారు. మరి రాజకీయ నాయకుల ఇళ్లల్లో మాత్రం బంగారు గుడ్లు ఎలా వస్తున్నాయో తెలియడం లేదని అన్నారు.
కొన్ని కుటుంబాలు తన ఆర్దిక ఎదుగుదల కోసం ప్రజలను దారిద్యంలోకి నెట్టేశారని, కొంతమంది రాజకీయాలకు వేలకోట్లు అవసరం అంటున్నారని పవన్ అన్నారు. ఎన్నివేల కోట్లు పెట్టామని ఇంతమంది అన్నదమ్ములు, ఆడపడుచులు ఇక్కడికి వచ్చారని అడిగారు.
పులివెందుల యురేనియం తవ్వకాలపై భరత్రెడ్డి అనే యువకుడి ఆవేదన ఇక్కడ చూస్తున్నామని, ఇలాంటి రెడ్డి కావాలని, ఇలాంటి యువకుల్నే నాయకుల్ని చేస్తామని పవన్ అన్నారు. ఓ వైపు జనసేనకు బలం లేదంటూనే మన బలం చూసి భయపడుతున్నారని అన్నారు.
"జనసైనికుల మీద దాడులకి పాల్పడుతున్నారు. జనసేన కార్యకర్తల మీద దాడులు చేసే వారికి ఇదే నా హెచ్చరిక. నా పేరు పవన్కళ్యాణ్... మా జనసైనికుల మీద ఎవరైనా దాడులు చేస్తే తోలుతీస్తా. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున అన్ని అంశాలకీ సమాధానం చెబుతాను" పవన్ అన్నారు.