ఎట్టకేలకు కొణతాలకు చంద్రబాబు లైన్ క్లియర్
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు.తనను కోరుకొనే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా కొణతాల ప్రకటించారు.
గత ఎన్నికల తర్వాత కొణతాల రామకృష్ణ వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీని వీడే సమయంలో కొణతాల వైసీపీ నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. అటు తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ విషయమై కొణతాల రామకృష్ణ చర్చలు నిర్వహిస్తున్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలను కూడ కొణతాల నిర్వహించారు.
అయితే కొణతాల రామకృష్ణను టీడీపీలో చేరాలని ఆ పార్టీ ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవలనే వైసీపీ నేతలు కూడ కొణతాలతో టచ్లోకి వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఈ తరుణంలో త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నారు.
ఈ మేరకు మంగళవారం నాడు అనుచరులు,శ్రేయోభిలాషులతో కొణతాల రామకృష్ణ సమావేశమయ్యారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై వారి అభిప్రాయాలను ఆయన తీసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరే సమయంలో కూడ అందరం కలిసే వెళ్లామని కొందరు ఈ సందర్భంగా కొణతాలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.
తనపై వైసీపీ నాయకత్వం నమ్మకం ఉంచకుండా... తనపై అనుమానం వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా కొణతాల ప్రస్తావించినట్టు సమాచారం. ఈ పరిణామం తనకు బాధ కల్గించినట్టు చెప్పారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు వైసీపీలో చేరాలని కూడ కొందరు ఈ సమావేశంలో సూచించినట్టు తెలుస్తోంది. తనను ఏ పార్టీ కోరుకొంటుందో ఆ పార్టీలో చేరితే ఉత్తమమని తాను అభిప్రాయపడుతున్నట్టుగా కొణతాల సమావేశంలో స్పష్టం చేసినట్టుగా సమాచారం. మార్చి 2,3, 5 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు తెలిపారు.
నర్సీపట్నం, మాడ్గుల, చోడవరం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొణతాల ఏ పార్టీలో చేరాలనే దానిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే మీరంతా తనతోనే తాను చేరే పార్టీలో చేరాల్సిన అవసరం లేదని కూడ ఒకానొక దశలో కొణతాల చెప్పారని తెలుస్తోంది.
మరో వైపు కొణతాల ఏ పార్టీలో చేరితే తాము కూడ అదే పార్టీలో చేరుతామని పలువురు చెప్పారని సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన విషయమై న్యాయ పోరాటం చేసే విషయమై ఈ నెల 28వ తేదీన చంద్రబాబునాయుడుతో చర్చించనున్నట్టు కొణతాల ప్రకటించారు.
కొణతాల రామకృష్ణ ఆయన ప్రత్యర్థి దాడి వీరభద్రరావులు గతంలో వైసీపీలో ఉన్నారు. వీరిద్దరూ కూడ ప్రస్తుతం వైసీపీని వీడారు. దాడి వీరభద్రరావును జనసేనలో చేరాలని విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు. అయితే దాడి వీరభద్రరావు మాత్రం ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. కొంత కాలంగా దాడి వీరభద్రరావు టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను టీడీపీకి చెందిన స్థానిక నేతలు అడ్డుకొన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.
దాడి వీరభద్రరావు ఏ పార్టీలో చేరుతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. రెండు మూడు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రానుంది.