కొణతాల ఎఫెక్ట్: వైసిపిలోకి దాడి రీఎంట్రీ ప్లాన్స్
కొణతాల ఎఫెక్ట్: వైసిపిలోకి దాడి రీఎంట్రీ ప్లాన్స్
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన దాడి వీరభద్రరావు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన దాడి వీరభద్రరావు ఆ నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తిరిగి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో సమావేశమైన దాడి వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
వైసీపీలో చేరాల్సిందిగా తనను ఆ పార్టీ నాయకులు కోరుతున్నారని అనుచరులతో చెప్పుకొచ్చారు దాడి వీరభద్రరావు. 10 రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని అందుకు అంతా సహకరించాలని ఏ పార్టీలో చేరితే బాగుంటుందో చెప్పాలని కూడా కోరారు
దీంతో మీరు ఏ రాజకీయ పార్టీలో చేరాలనుకుంటున్నారో తాము కూడా అదే పార్టీలో చేరి, మీ వెంటే వుంటామని అనుచరులు దాడి వీరభద్రరావుకు హామీ ఇచ్చారు. అలాగే కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు. అయితే ఎక్కువమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇదంతా ఒక ఎత్తైతే తన రాజకీయ ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో దాడి వీరభద్రరావు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుచరులకు హితోపదేశం చేశారు దాడి వీరభద్రరావు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానికేతరులకు అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లాలో ఇప్పటికే స్థానికేతర నేతల ప్రాబల్యం ఎక్కువైందని ఆ పరిస్థితిని గ్రామీణ ప్రాంతానికి తీసుకురావద్దని సూచించారు.
డబ్బున్నవారికి అనకాపల్లి నియోజకవర్గం లోకువ అయ్యిందని, డబ్బులు ఇచ్చి భోజనం పెడితే ఇక్కడి ఓటర్లు గెలిపిస్తారనే చెడ్డపేరు ఉందని దానిని తొలగించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టి, తరువాత అవినీతికి తెర లేపుతున్నారని వీరభద్రరావు ఆరోపించారు
ఈ విషయంలో సీఎం చంద్రబాబు నిస్సహాయుడైనట్టు కనిపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టిక్కెట్లు ఇవ్వాలని కార్యకర్తల సమావేశంలో తీర్మానం చేయించారు. ఆ తీర్మానంతో స్థానికులకే టికెట్లు ఇవ్వాలంటూ అన్ని రాజకీయ పార్టీలను కోరబోతున్నట్లు తెలిపారు. ఇకపోతే 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు.
అదే సమయంలో తన కుమారుడు దాడి రత్నాకర్ తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాడి రత్నాకర్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఫలితాలు వెలువడిన ఏడాది లోపే దాడి వీరభద్రరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఒకలా జైలు నుంచి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ ఎవరినీ నమ్మరన్న ఆయన చివరకు తల్లినీ, చెల్లిని కూడా నమ్మరంటూ మండిపడ్డారు.
తనకంటే తన చెల్లి షర్మిల ఎదిగిపోతుందన్న భయం జగన్ లో కనబడుతుందని అందువల్లే షర్మిలకు ప్రాధాన్యత తగ్గించారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ ఓడిపోవడానికి కారణం వైఎస్ జగనేనని చెప్పుకొచ్చారు.
అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన దాడి వీరభద్రరావు తిరిగి వైసీపీ గూటికి చేరాలని ప్రయత్నాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. దాడి వీరభద్రరావు రాకను వైఎస్ జగన్ ఎలా స్వాగతిస్తారో అన్నదానిపై ఉత్కంఠ కలుగుతోంది.
మరోవైపు దాడి వీరభద్రరావు జనసేన పార్టీలోకి చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా దాడి వీరభద్రరావు నివాసానికి వెళ్లారు. దాడిని పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. అయితే జనసేనలో చేరే అంశంపై మౌనం వహించారు
ఏపీలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దాంట్లో చేరడం మంచిదని భావిస్తున్నారు దాడి వీరభద్రరావు. మరి ఆయన ఏ పార్టీలోచేరతారో అన్నది పదిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.