జగన్ ప్లాన్: తొలి సంతకం ఏదీ ఉండదు
పాదయాత్రలు చేసిన తర్వాత ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడులు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు తొలి సంతకాలు చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మాత్రం తొలి సంతకం ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు. అయితే నవరత్నాల కార్యక్రమంపై జగన్ కేంద్రీకరించనున్నారు.
2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అప్పటి సీఎల్పీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సమయంలో రైతులకు ఉచిత విద్యుత్ను ఇస్తామని వైఎస్ఆర్ హామీ ఇచ్చారు.ఈ హమీపై ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం ఉచిత విద్యుత్ సాధ్యం కాదని చెప్పారు.
2004 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.ఈ ఎన్నికల్లో టీడీపీ 40కు పైగా అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకొంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేశారు. ఆ సమయంలో ఎల్బీ స్టేడియంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేదికపైనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేస్తున్నట్టుగా ప్రకటించి రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 నుండి 2014 వరకు చంద్రబాబునాయుడు ప్రతిపక్షనాయకుడిగానే కొనసాగారు.2012 అక్టోబర్ రెండో తేదిన చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర సుధీర్ఘంగా సాగింది. ఈ పాదయాత్ర సమయంలో రైతులకు రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలు రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
హిందూపురంలో చంద్రబాబునాయుడు పాదయాత్రను ప్రారంభించిన మారునాడే ఈ హామీని ఇచ్చారు. 2014లో గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ప్రాంగంణంలోనే చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారం వేదికపైనే రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, చేనేత రుణ మాఫీ అమలుపై చంద్రబాబునాయుడు సంతకం చేశారు. పెన్షన్ల పెంపుపై రెండో సంతకం, అన్ని గ్రామాలకు మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై సంతకం చేశారు. బెల్టు షాపుల రద్దుపై సంతకం చేశారు.ఉద్యోగుల ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుండి 60 ఏళ్లకు పెంచే ఫైల్పై సంతకం చేశారు.
అయితే చంద్రబాబునాయుడు ఐదు సంతకాలపై ఆనాడు విపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. రైతుల రుణ మాఫీ కోసం చంద్రబాబునాయుడు సంతకం చేయలేదని వైసీపీ విమర్శలు చేసింది. రైతుల రుణ మాఫీ విషయమై అధ్యయనం చేసేందుకు సంతకం చేసిందని వైసీపీ విమర్శించిన విషయం తెలిసిందే.
2019 ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ 151 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నెల 30వ తేదీన వైఎస్ జగన్ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వైఎస్ జగన్ మాత్రం తొలి సంతకం చేయరు. ఎన్నికల ప్రచార సమయంలోనూ, పాదయాత్రలో వైసీపీ చీఫ్ జగన్ నవరత్నాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.
నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. నవరత్నాలు ప్రజలకు చేరువయ్యాయి.ఈ పథకాలను పకడ్బందీగా అమలు చేయడమే లక్ష్యంగా జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే జగన్ తొలి సంతకం చేయడం లేదు. నవరత్నాల అమలే జగన్ తొలి సంతకమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.