జగన్ కు చిక్కులు: చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతుల్లోకి కాపు ఉద్యమం
ముద్రగడ నిర్మయంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండా ఉమా మహేశ్వర రావు చేసిన ప్రకటనను పరిశీలిస్తే కాపు ఉద్యమం తీసుకునే మలుపు అర్థమవుతుంది.
అమరావతి: కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు చిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గం తనపై చేయిస్తున్న దుష్ప్రచారానికి మనస్తానికి గురై ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం చెప్పారు. కాపు సామాజిక వర్గానికి ఓ బహిరంగ లేఖ కూడా రాశారు.
ముద్రగడ నిర్మయంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండా ఉమా మహేశ్వర రావు చేసిన ప్రకటనను పరిశీలిస్తే కాపు ఉద్యమం తీసుకునే మలుపు అర్థమవుతుంది. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడానికి తాను 13 జిల్లాలో కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. ముద్రగడ నిర్ణయం సరి కాదని అంటూనే ఆయన ఆ విధంగా అన్నారు. దీన్నిబట్టి టీడీపీ కాపు రిజర్వేషన్ పోరాటాన్ని సాగించి జగన్ కు చిక్కులు కల్పించే అవకాశం లేకపోలేదని అనిపిస్తోంది.
ముద్రగడ పద్మనాభం టీడీపీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. టీడీపీ కాపు నేతలు ముందుండి పోరాటం చేయడానికి చంద్రబాబు మాత్రమే కాకుండా జనసేన పవన్ కల్యాణ్ ఊతమిచ్చే అవకాశం ఉంది. జగన్ మీద పోరాటానికి ఇదే సరైన ఆయుధంగా చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. కాపు రిజర్వేషన్ల కల్పన తన వల్ల కాదని చెప్పిన నేపథ్యంలో తమ ప్రభుత్వ హయాంలో తాము చేసిన నిర్ణయాన్ని ముందుకు తెచ్చి చంద్రబాబు జగన్ ను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపులకు ఐదు శాతం కేటాయిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమ నిర్ణయం అమలుకు పచ్చజెండా ఊపాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని కూడా కోరింది. అసెంబ్లీలో తీర్మాన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు.
ఈలోగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఓ ప్రముఖ దినపత్రికలో ఈబీసీ రిజర్వేషన్లు ఏపీలో అమలు కాకపోవడంపై భారీ వార్తాకథనం ప్రచురితమైంది. ఆ పత్రిక టీడీపీకి అనుకూలమనే అభిప్రాయం ఉంది. ఈ వార్తాకథనాన్ని బట్టి కూడా టీడీపీ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని వైఎస్ జగన్ మీదికి గురి పెట్టే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ కాపులకు ప్రకటించిన పథకాలను విమర్శించారు. కాపు రిజర్వేషన్లకు గండి కొట్టడానికి వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే కాపు రిజర్వేషన్ పోరాటానికి పవన్ కల్యాణ్ మద్దతు పరోక్షంగానైనా ఉండవచ్చునని భావిస్తున్నారు. టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ మీద ఒత్తిడి పట్టే అవకాశం కూడా లేకపోలేదు.