రఘురామపై అనర్హత వేటు పడుతుందా: సెక్షన్ -2 ఏం చెబుతోంది?
రఘురామపై అనర్హత వేటు వేయడం ఖాయమంటూ శరద్ యాదవ్ ఘటనను ఉదహరిస్తున్నాయి కొన్ని వైసీపీ అనుకూల వర్గాలు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు లోక్ సభ స్పీకర్ ఒంబిర్లాకు ఫిర్యాదు చేశారు. నిన్న ప్రత్యేక విమానంలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్, మిథున్ రెడ్డి, బాలశౌరిలు స్పీకర్ ను కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ఇకపోతే రఘురామపై అనర్హత వేటు వేయడం ఖాయమంటూ శరద్ యాదవ్ ఘటనను ఉదహరిస్తున్నాయి కొన్ని వైసీపీ అనుకూల వర్గాలు. మూడేళ్ల క్రితం బిహార్లో సీఎం నితీష్ కుమార్ ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసింది. ఆ తరువాత కొన్నాళ్లకే మరల ఆ ఇద్దరితో బంధాన్ని తెంచుకొని, మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ నేత శరద్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. విపక్షాలు నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ, పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగా శరద్ యాదవ్ను ఫిరాయింపుల నిరోధక చట్టం (యాంటీ డెఫెక్షన్ లా) సెక్షన్-2 కింద అనర్హుడిగా ప్రకటించాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని నితీష్ కుమార్ కోరారు. తక్షణమే స్పందించిన వెంకయ్య నాయుడు శరద్ యాదవ్పై వేటు వేశారు.
ఇప్పుడు ఇదే సెక్షన్-2. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు నిన్న స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసారు. దీనితో ఇప్పుడు ఈ సెక్షన్ రఘురామకు వర్తిస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇక ఈ విషయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.... చట్టసభల వెలుపల చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు అనర్హత చట్టంలోని సెక్షన్ 2 కిందకు రావని అన్నారు. రెండు అంశాల్లో మాత్రమే సెక్షన్ 2 కింద అనర్హత వేటు వేసే వీలుంటుంది.
విప్ ను ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు విప్ జారీ చేసినా దానికి కట్టుబడకుండా సభకు గైర్హాజరైనప్పుడు మాత్రమే అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవచ్చుని యనమల అన్నారు.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు కాబట్టి, ఆయనపై సెక్షన్ 2 కింద అనర్హత వేటు వేయలేరని యనమల తెలిపారు. యనమల రామకృష్ణుడు చెప్పిన విషయాలతో చాలామంది విశ్లేషకులు సైతం ఏకీభవిస్తున్నారు.
ఇకపోతే.... రఘురామకృష్ణంరాజు పదే పదే తాను ఎప్పటికీ ముఖ్యమంత్రికి విధేయుడినని, పార్టీ మాట జవదాటడంలేదని అంటున్నారు. తనకన్నా పెద్ద స్వామిభక్తి పరాయణుడు పార్టీలో ఇంకొకరు లేరని ఆయన చెబుతున్నారు. ఆయన అన్ని టీవీ డిబేట్లలో కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు.
ఇకమనం రఘురామ విషయాన్నీ మామూలుగా చూసినా... ఆయన వేరే పార్టీలో చేరనంతవరకు, పార్టీ విప్ ని ధిక్కరించనంతవరకు ఆయనకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఆయన అవసరమనుకుంటే కోర్టు మెట్లు కూడా ఎక్కుతారు (ఇప్పటికే ఎక్కారు, భవిష్యత్తులో మరోమారు ఇదే విషయమై స్పీకర్ వేటు వేస్తే...... వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు). ఆయన అసెంబ్లీలో వల్లభనేని వంశి వంటి వారిలాగా బహిష్కృతనేతగా లోక్ సభలో అన్ని సమావేశాలకు హాజరవుతూ, పార్టీ విప్ ని ధిక్కరించకుండా, అధికారికంగా వేరే పార్టీలో చేరకుండా కొనసాగేలా కనబడుతున్నారు.