జగన్ తో ఫైట్: ఏపీలో చంద్రబాబు టీడీపీని నిలబెట్టగలరా?
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహరచనలో దిట్ట. ప్రత్యర్థులను ఢీకొట్టడంలో ఆయనది అందె వేసిన చేయి.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహరచనలో దిట్ట. ప్రత్యర్థులను ఢీకొట్టడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆ కారణంగానే ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితం సాగిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు చంద్రబాబుకు అదే శక్తిసామర్థ్యాలు ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
టీడీపీని ఎంత లేదన్నా మరో నాలుగేళ్ల పాటు కాపాడాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని ఆయన పటిష్టంగా ఉంచడమే కాకుండా తగ్గిన బలాన్ని తిరిగి ప్రోది చేయగలరా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. టీడీపీ ఎక్కడికక్కడ దెబ్బ తీయడానికి అన్ని వైపుల నుంచీ జగన్ దాడికి దిగుతూ వస్తున్నారు
వయస్సులో చిన్నవాడు. రాజకీయ పరిపక్వత లేదని అనుకుంటూ వచ్చారు. అయితే, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జగన్ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకమైన పాత్ర పోషించారు. అనూహ్యంగా జగన్ తిరిగి అధికారంలోకి వచ్చారు. పాదయాత్రనే ఆయనను అధికారానికి చేరువ చేసిందనే అభిప్రాయం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాకలు తీరిన చంద్రబాబును ఎదుర్కుని నిలబడగలరా అనే సందేహాలు కూడా కలుగుతూ వచ్చాయి
అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ చంద్రబాబును, ఆయన పార్టీని బలహీనపరచడానికి అవసరమైన చర్యలు చేపడుతూ వస్తున్నారు. అందులో అమరావతిని రాజధానిగా నిలబెట్టాలనే చంద్రబాబు నిర్ణయాన్ని తిరగదోడడం. మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చి అమరావతి ప్రక్రియను నీరు గార్చారు. అంతేకాకుండా అమరావతిలో బినామీ వ్యవహారాలను బయటకు తీయడానికి పూనుకున్నారు. అమరావతి ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమం క్రమక్రమంగా బలహీనపడుతూ రావడం చంద్రబాబుకు పెద్ద దెబ్బనే
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉంటూ, తమ ప్రభుత్వంపై ఎడతెరిపి లేని వాగ్యుద్ధం చేస్తున్న టీడీపీ నేతలను జగన్ దెబ్బ తీయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చింతమనేని ప్రభాకర్ తో మొదలైన కేసుల పరంపర కొల్లు రవీంద్ర వరకు వచ్చింది. మరింత మంది చంద్రబాబు సన్నిహితులైన తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. మాజీ పితాని సత్యనారాయణను కూడా ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆత్మరక్షణలో పడేశారు
తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన బలమైన వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి ఎమ్మెల్యేలను జగన్ తనకు అనుకూలంగా తిప్పుకున్నారు. కరణం బలరాం వంటి నేత విధేయతలు మారుస్తారని ఎవరూ అనుకుని ఉండరు. వంశీ విషయానికి వస్తే ఆయన టీడీపీలో చాలా కాలంగా అసౌకర్యంగానే ఉన్నారు. ప్రస్తుత మంత్రి కొడాలి నానితో పాటు ఆయన కూడా గతంలో టీడీపీలో ఇబ్బందులు పడ్డారు
చంద్రబాబును ఒంటరివాడిని చేసే ప్రక్రియను జగన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటికీ దేవినేని ఉమామహేశ్వర రావు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి నేతలు బలంగానే తమ గొంతు విప్పుతున్నారు. కానీ ఎంత కాలం వారు అలా గొంతు విప్పగలుగుతారనేది చెప్పలేం
చంద్రబాబుకు వయస్సు కూడా మీద పడుతోంది. ఆయన స్థానాన్ని కుమారుడు నారా లోకేష్ భర్తీ చేయాల్సి ఉంటుంది. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ మీద మాటల యుద్ధం సాగిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ కార్యకర్తలకు అండదండలు అందించి, వారికి భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది అంతగా ఫలితం ఇవ్వడం లేదు. నారా లోకేష్ జగన్ కు ధీటుగా వ్యూహరచన చేసి, అమలు చేయగలరా అనేది పెద్ద ప్రశ్న
తనను కేసులు చుట్టుముట్టినప్పటికీ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ జగన్ మొండిగా వ్యవహరించారు. కోర్టుకు హాజరవుతూనే ఆయన పాదయాత్రను కొనసాగించారు. ఆ సమయంలో టీడీపీ ఆయనపై తీవ్రమైన విమర్శలు, ఆరోపణల దాడిని సాగించింది. అవేవీ జగన్ అధికారాన్ని అందుకోవడాన్ని అడ్డుకోలేకపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మూలాలను దెబ్బ తీయడానికి జగన్ ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నాడు. అవకాశాలను వెతుక్కుంటున్నారు కూడా
ఇప్పటికే తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. నాయకులు నామమాత్రంగా మిగిలారు. ఇటీవలి కాలంలో టీడీపీ నాయకుల గొంతు కూడా వినిపించడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెసు, బిజెపి నేతలు విమర్శల జడివాన కురిపిస్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం దాదాపుగా నోరు విప్పడం లేదు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీ నామమాత్రంగా మిగిలిపోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎన్నికలు సమీపించే నాటికి రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు ఏదైనా చేస్తారనే నమ్మకం ఉండవచ్చు. ఆయన గతంలో మాదిరిగా రాష్ట్రంలో పాదయాత్ర చేయగలరా అనేది పెద్ద ప్రశ్న. నారా లోకేష్ టీడీపీని నిలబెట్టడానికి ఏ విధమైన కార్యక్రమం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.