మోగిన ఎమ్మెల్సీ నగారా: జగన్కు తలపోటు, వైసీపీలో ఆ ముగ్గురు ఎవరు..?
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఏపీలో మూడు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. అయితే అభ్యర్ధులను ఎంపిక చేయడం జగన్కు కత్తిమీదసామేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఏపీలో మూడు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. అయితే ఇక్కడే ఆ పార్టీ అధినేత జగన్కు చిక్కొచ్చిపడింది. పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దొరకని వారు, టికెట్ దొరికినా ఓడిపోయిన నేతలు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి చివరి ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో వైసీపీలో చేరారు. దీంతో ఆమెకు టికెట్ కేటాయించలేదు, నామినేటేడ్ పోస్టులకు సైతం లిస్ట్ భారీగా ఉండటంతో..కృపారాణి ఎమ్మెల్సీ పదవిపై ఆశపెట్టుకున్నారు.
ఇక మరో నేత అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్సభ సభ్యునిగా గెలిచిన పండుల.. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనివార్య కారణాల వల్ల జగన్.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఈసారి ముఖ్యమంత్రి తనపై కరుణ చూపుతారని రవీంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.
ఇక సినీనటుడు అలీకి సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మంత్రి కావాలన్నది తన కల అని అప్పట్లో అలీ చెప్పడం సంచలనం సృష్టించింది. ఇతనితో పాటు సినీరంగానికి చెందిన మోహన్ బాబు, జయసుధ వంటి వారి పేర్లు సైతం ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్నాయి.
ఇక అన్నింటికి మించి రాయలసీమ జిల్లాల నుంచి మండలిలో బెర్త్ కోసం జగన్కు ఇబ్బందులు వచ్చే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సీనియర్ నేతలు డీఎల్ రవీంద్రా రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డితో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలు సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీపడుతున్నారు. దీంతో అభ్యర్ధులను ఎంపిక చేయడం జగన్కు కత్తిమీదసామేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.